భారత ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయం – మోడీ
78 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని మోడీ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఆ సమయంలో భారత ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా పూలవర్షం కురిపించింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ దనఖడ్, కేంద్రమంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2047 వికసిత్ భారత్ థీమ్తో ఈసారి పంద్రాగస్టు వేడుకలు జరుగుతున్నాయి.
ఇక ఎర్రకోటపై జాతీయజెండాను ఎగురవేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదే జాతినుద్దేశించి ప్రసంగించారు. ముందుగా దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్స శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయం అని అన్నారు. హర్ఘర్ తిరంగా పేరుతో దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరుగుతున్నాయన్నారు. దేశం కోసం తమ జీవితాలనే పణంగా పెట్టిన మహనీయులు ఎందరో ఉన్నారని, ఈ సందర్భంగా వారి త్యాగాలను స్మరించుకుందామని ప్రధాని పిలుపునిచ్చారు. మహనీయుల త్యాగాలకు ఈ దేశం రుణపడి ఉందని పేర్కొన్నారు.
శతాబ్దాల తరబడి దేశం బానిసత్వంలో మగ్గిందని, స్వాతంత్ర్యం కోసం ఆ నాడు 40 కోట్ల మంది పోరాడారని గుర్తు చేశారు. ఇవాళ దేశ జనాభా 140 కోట్లకు చేరుకుందని, మనమంతా వారి కలలను సాకారం చేయాలని పిలుపునిచ్చారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని తెలిపారు.