హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. ఎమ్మెల్యే ఎన్నికల షెడ్యూల్ను తెలంగాణ ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఫిబ్రవరి 3 నుంచి 10 వరకు నామినేషన్ల స్వీకరించనున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 11న స్క్రూటినీ నిర్వహించనున్నట్లు పేర్కొంది. నామినేషన్ ఉపసంహరణకు ఫిబ్రవరి 13 చివరి తేదీ అని తెలిపింది. ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించి మార్చి 3న ఫలితాలు వెల్లడించనున్నట్లు తెలిపింది.
తెలంగాణలో ఖాళీ కానున్న మూడు స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ జారీ అయ్యింది. ఒక గ్రాడ్యుయేట్, రెండు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదల అయ్యింది. ఈ మూడు స్థానాలకు ప్రస్తుతం జీవన్ రెడ్డి, కూర రఘోత్తమ్ రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రాతినిద్యం వహిస్తున్నారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, అదిలాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదల చేశారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం షెడ్యూల్ రిలీజ్ అయ్యింది.

ఆంధ్రప్రదేశ్లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి షెడ్యూల్ విడుదల చేసింది. కాగా, ఈ ఎన్నికలు జరుగుతాయని ఇటీవలే బీజేపీ తెలంగాణలో అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఏపీలో కూటమి ప్రభుత్వం అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు అభ్యర్థులను ప్రకటించడం కాస్త ఆలస్యం వహిస్తున్నాయనే చెప్పవచ్చు.