రాష్ట్రంలో తొలి కంటెయినర్ పాఠశాలను ప్రారభించబోతున్న మంత్రి సీతక్క

రాష్ట్రంలో తొలి కంటెయినర్ పాఠశాల సిద్ధమైంది. తొలిసారిగా ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలను కంటెయినర్‌లో ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క మంగళవారం ప్రారంభించనున్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని కాంతనపల్లి అటవీ ప్రాంతంలో బంగారుపల్లి ఆవాస గ్రామం విద్యార్థుల కోసం ఈ కంటెయినర్ పాఠశాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం గుడిసెలో నడుస్తున్న పాఠశాల శిధిలావస్థకు చేరుకుంది.

అటవీ ప్రాంతం కావడంతో కొత్త పాఠశాల భవన నిర్మాణానికి అటవీ శాఖ అధికారులు అనుమతులివ్వలేదు. దీంతో ఇక్కడ కంటెయినర్ పాఠశాల ఏర్పాటుకు మంత్రి సీతక్క శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ములుగు నియోజకవర్గంలోని తాడ్వాయ్ మండలంలో కంటెయినర్ ఆసుపత్రిని మంత్రి సీతక్క అందుబాటులోకి తేవడంతో స్థానిక ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయి. అదే కోవలో ఇప్పుడు కంటెయినర్ పాఠశాలను ప్రారంభిస్తున్నారు. ఈ కంటెయినర్ పాఠశాల 25 అడుగుల వెడల్పు, 25 అడుగుల పొడవుతో రూపొందించారు. ఇందులో ఇద్దరు టీచర్లు పనిచేస్తుండగా..వారితో పాటు విద్యార్ధులు సౌకర్యవంతంగా కూర్చునే విధంగా కంటెయినర్ పాఠశాలను అందుబాటులోకి తెచ్చారు.