విపక్షల ఆరోపణలపై స్పందించిన మంత్రి నిర్మలా

Minister Nirmala responded to the allegations of the opposition

న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో… విపక్ష పార్టీలు పాలించే రాష్ట్రాలపై వివక్ష చూపారని ఇండియా కూటమి ధ్వజమెత్తింది. ఎన్డీయే ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పార్లమెంటు లోపలా, వెలుపలా నిరసన వ్యక్తంచేసింది. అయితే, ఈ ఆరోపణలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ దీటుగా స్పందించారు. బుధవారం రాజ్యసభలో ప్రసంగించిన ఆమె.. బడ్జెట్‌ ప్రసంగంలోనే అన్ని రాష్ట్రాల పేర్లను చెప్పలేమంటూ విపక్షాలను దుయ్యబట్టారు.

”కేంద్రం ప్రవేశపెట్టే ప్రతీ బడ్జెట్‌లో దేశంలోని అన్ని రాష్ట్రాల పేర్లను ప్రస్తావించే అవకాశం రాదు. మహారాష్ట్రలోని వందవన్‌లో పోర్ట్‌ను ఏర్పాటుచేయాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. కానీ, నిన్నటి బడ్జెట్‌లో మహారాష్ట్ర పేరును చెప్పలేదు. అలాగని.. తమను విస్మరించారని ఆ రాష్ట్రం భావిస్తోందా? బడ్జెట్‌ ప్రసంగంలో ఓ రాష్ట్రం పేరును ప్రస్తావించనంత మాత్రాన.. కేంద్రం నుంచి వారికి నిధులు వెళ్లవా? విపక్షాలది దారుణమైన ఆరోపణ. తమ రాష్ట్రాలకు ఏమీ ఇవ్వలేదన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించాలని ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి కుట్రలు చేస్తున్నాయి” అని నిర్మలమ్మ దుయ్యబట్టారు.

ఆమె సమాధానంపై విపక్షాలు అసంతృప్తి వ్యక్తంచేశాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్‌ చేశాయి. ఈసందర్భంగా రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. ”బడ్జెట్‌లో రాష్ట్రాల మధ్య సమతుల్యత లేకపోతే అభివృద్ధి ఎలా సాధ్యపడుతుంది? దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపై నిరసన తెలియజేస్తాం” అని అన్నారు.

ఇక, సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ ప్రాంగణంలో ఇండియా కూటమి నేతలు బడ్జెట్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అఖిలేశ్ యాదవ్‌ మాట్లాడుతూ.. ”రైతులకు కనీస మద్దతు ధరపై చట్టబద్ధత కల్పించాలని ఎంతోకాలంగా డిమాండ్‌ చేస్తున్నాం. కానీ, ఈ బడ్జెట్‌లో కేంద్రం తమ మిత్రపక్షాలకు మాత్రమే ‘మద్దతు ధర’ ఇచ్చింది” అంటూ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.