ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ కీలక చర్యలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యా వ్యవస్థ పనితీరును మెరుగుపర్చేందుకు ఉండవల్లిలో తన నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో సుమారు మూడు గంటల పాటు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు పలు అంశాలపై చర్చించారని సమాచారం.
జూన్ 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మెగా డీఎస్సీ (DSC) పరీక్షల నిర్వహణ
జూన్ 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మెగా డీఎస్సీ (DSC) పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు ఉండకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పరీక్షా కేంద్రాల్లో కంప్యూటర్లు, ఇంటర్నెట్, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను సమర్థవంతంగా ఏర్పాటు చేయాలని, టీసీఎస్ అయాన్ కేంద్రాలలో సాంకేతిక సమస్యలు ఎదురుకాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అభ్యర్థుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ సెంటర్లు నిరంతర సేవలందించేలా చూడాలని సూచించారు.
టెట్ సర్టిఫికెట్ల అప్లోడ్కు ప్రత్యేక ఆప్షన్
డీఎస్సీకి టెట్ అర్హతలే అవసరమని, అభ్యర్థుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని టెట్ సర్టిఫికెట్ల అప్లోడ్కు ప్రత్యేక ఆప్షన్ అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. అభ్యర్థులు వెరిఫికేషన్ సమయానికి తగిన ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే చాలు అని పేర్కొన్నారు. ఈ నిర్ణయాలతో అభ్యర్థుల్లో మరింత నమ్మకం పెరిగే అవకాశముందని అధికారులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో విద్యా రంగాన్ని గట్టి పునాది మీద నిలిపేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని మంత్రి హామీ ఇచ్చారు.
Read Also : Sugavasi Palakondrayudu : మాజీ ఎమ్మెల్యే కన్నుమూత