ఆంధ్రప్రదేశ్లో HCL సంస్థను మరింత విస్తరించి మరో 10 వేల మందికి ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టాలని మంత్రి నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు. దావోస్ పర్యటనలో భాగంగా HCL సీఈవో కళ్యాణకుమార్తో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఏపీలో ఉన్న పారిశ్రామిక ప్రోత్సాహకాలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త విధానాలపై మంత్రి లోకేశ్ వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలకు విశేష ప్రాధాన్యం ఇస్తున్నట్లు మంత్రి చెప్పుకొచ్చారు. ఈ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోంది. రీలొకేషన్ చేసే పరిశ్రమలు, ఎక్విప్మెంట్ ఇంపోర్టుకు 50 శాతం రాయితీలు కల్పించడంతో పాటు అనేక సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.
HCL ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో తమ కార్యకలాపాలను నిర్వహిస్తూ రాష్ట్ర అభివృద్ధికి మద్దతు ఇస్తోందని మంత్రి ప్రశంసించారు. అయితే ఇప్పుడున్న స్థాయిని మరింత విస్తరించడానికి అవసరమైన సహకారం ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. ఈ విస్తరణ ద్వారా యువతకు మరింత ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని మంత్రి అభిప్రాయపడ్డారు. దావోస్ పర్యటన సందర్భంగా HCL వంటి సంస్థలతో జరిగిన చర్చలు రాష్ట్ర అభివృద్ధికి పునాది వేస్తాయని, మున్ముందు మరిన్ని సంస్థలు రాష్ట్రంలో తమ కార్యకలాపాలు విస్తరించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు.