న్యూఢిల్లీ: మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ తో భేటీ అయ్యేందుకు ఢిల్లీకి వెళ్లారు. లోకేష్ కేంద్ర మంత్రిని కలవడానికి ముందుగానే లోకేష్ ను కలిసేందుకు ప్రశాంత్ కిషోర్ వచ్చారు. లోకేష్ తో సమావేశమయ్యారు. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ పనుులు చేయడంలేదు. ఐ ప్యాక్ నుంచి కూడా పూర్తిగా బయటకు వచ్చారు. అయితే లోకేష్, చంద్రబాబుతో మాత్రం సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు.
ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం సొంతరాజకీయాలు చేసుకుంటున్నారు. జనసురాజ్ పేరుతో బీహార్ లో పార్టీ పెట్టుకుని రాజకీయ పోరాటం చేసుకుంటున్నారు. బీహార్ ఎన్నికల విషయంలో ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం ఒంటరిగా పోటీ పడుతున్నారు. ఉపఎన్నికల్లో ఆయన పార్టీ తరపున పోటీ చేసిన స్థానాల్లో అభ్యర్థులు మూడో స్థానంలో నిలిచారు. ఇటీవల ఉద్యోగ నియామకాల విషయంలో జరిగిన అవకతవకల విషయంలో ఆమరణదీక్షచేసి ప్రజల్లో పేరు తెచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆయన గేమ్ ఛేంజర్ అవుతారన్న అభిప్రాయం వినిపిస్తోంది.

అయితే బీహార్ ఎన్నికల విషయంలో నారా లోకేష్ తో ప్రత్యేకంగా చర్చించేదేమీ ఉండదు కానీ..ఆయన టీడీపీకి అవసరమైనప్పుడు రాజకీయ సలహాలు ఇస్తున్నారని చెబుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి పని చేసిన రాబిన్ శర్మ ఇప్పటికీ టీడీపీకి పని చేస్తున్నారు. తెలంగాణలో టీడీపీని రివైవ్ చేసేందుకు ఆయన ప్రణాళికలు రెడీ చేస్తున్నారన్న ప్రచారం జరిగింది. కానీ ఈ విషయంలో ఎలాంటి ముందడుగు పడటం లేదు. రాబిన్ శర్మతో పాటు ప్రసాంత్ కిషోర్ తెలంగాణలో టీడీపీ మళ్లీ యాక్టివ్ అయ్యేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేశారని ఆ అంశంపై చర్చించి ఉంటారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే టీడీపీ వర్గాలు మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఆ తర్వాత నారా లోకేష్ కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తో సమావేశమయ్యారు. ఆయనతో పాటు ఏపీకి చెందిన నేతలు, కేంద్ర మంత్రులు ఉన్నారు. పలు ఐటీ సంస్థలు ఏపీలో కార్యాలయాలను ప్రారంభించనున్న తరుణంలో ఈ అంశాలపై చర్చించేందుకు సమావేశం అయ్యారని చెబుతున్నారు.