జ్యూరిచ్: జ్యూరిచ్లో పెట్టుబడిదారులతో జరిగిన సమావేశంలో మంత్రి భరత్ మాట్లాడారు. ఈ సందర్భంగా లోకేశ్ సీఎం అవుతారని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో వేదికపై సీఎం చంద్రబాబు కూడా ఉన్నారు. టీడీపీలో ఫ్యూచర్ లీడర్ లోకేశ్ అని.. ఎవరికి నచ్చినా…నచ్చకపోయినా..ఫ్యూచర్ లీడర్ లోకేశ్ అని మంత్రి స్పష్టం చేశారు. కాబోయే ముఖ్యమంత్రి కూడా లోకేషేనన్నారు. మంత్రి నారా లోకేశ్ ఉన్నత విద్యావంతుడని తెలిపారు. ఏపీ రాజకీయ నాయకుల్లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివింది నారా లోకేశ్ ఒక్కడే అని చెప్పుకొచ్చారు. ఎవరికి నచ్చినా.. నచ్చకపోయినా భవిష్యత్తు ముఖ్యమంత్రి నారా లోకేశ్ అని అన్నారు.

ఈ సందర్భంగా తెలుగు పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి టీజీ భరత్ మాట్లాడుతూ.. జగన్ హయాంలో ఏపీలో పరిశ్రమలు పెడితే, పెట్టుబడులు పెడితే ఏమవుతుందనే అనుమానం ఉందని అన్నారు. సొంత తల్లి, చెల్లికి న్యాయం చేయనివాడు ప్రజలకుఏం చేస్తాడని జగన్పై విమర్శలు గుప్పించారు. మరోవైపు ఏపీ మంత్రి నారా లోకేశ్ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో టీడీపీ అధిష్ఠానం సీరియస్ అయ్యింది. ఈ అంశంపై ఎవరూ మాట్లాడవదవ్దని, మీడియా ముందు బహిరంగ ప్రకటనలు చేయవద్దని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏ నిర్ణయమైనా కూటమి నేతలు కూర్చొని మాట్లాడుకుంటారని స్పష్టం చేసింది. టీడీపీ నాయకులు తమ వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని హెచ్చరించింది.
ఇకపోతే.. టీడీపీలో చంద్రబాబు తర్వాత ఎవరు అంటే.. లోకేష్ తప్ప ఎవరూ కనిపించడం లేదు. పూర్తి స్థాయిలో నారా లోకేష్ పార్టీపై పట్టు సాధిస్తున్నారు. ఆయన అన్ని స్థాయిల్లో పార్టీ నేతలతో పాటు కింది స్థాయి క్యాడర్ తోనూ అనుబంధం పెంచుకుంటున్నారు. ప్రభుత్వంలోనూ కీలకంగా ఉన్నారు. చంద్రబాబు తర్వాత లోకేషేనని చెప్పాల్సిన పని లేదు. అయినా మంత్రి భరత్ ఈ డిమాండ్ ను వినిపించడం ఆసక్తికరంగా మారింది. తెలుగుదేశం పార్టీలో ఫ్యూచర్ సీఎం లోకేషేనని ప్రత్యేకంగా మద్దతు అడగాల్సిన పని కూడా లేదు.