ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విపక్ష వైసీపీకి, అధికార పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలకు మధ్య సాగుతున్న పోరు నిత్యం చూస్తూనే ఉన్నాం. వైసీపీ వర్సెస్ కూటమిగా సాగుతున్న ఏపీ రాజకీయాల్లో ఇవాళ ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది.పార్లమెంట్ సాక్షిగా ఓ వైసీపీ ఎంపీ, మాజీ ఫ్లోర్ లీడర్ కూడా అయిన పీవీ మిథున్ రెడ్డి.. టీడీపీ ఎంపీలతో కలిసి ఓ కీలక అంశంపై పోరాడేందుకు సిద్దమని పార్లమెంట్ లోనే తేల్చిచెప్పేశారు.

ఇవాళ లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తీర్మానంపై చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా వైఎస్ఆర్ సీపీ తరఫున చర్చలో మాట్లాడిన ఎంపీ మిథున్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించవద్దంటూ కేంద్రాన్ని వేడుకున్నారు. ఒరిజినల్గా పోలవరం ప్రాజెక్టు సామర్థ్యం 194 టీఎంసీలు అని, ఏడున్నర లక్షల ఎకరాలకు నీరు అందేలా దీన్ని డిజైన్ చేశారని గుర్తుచేశారు. ఇరిగేషన్ తో పాటు తాగునీటి కోసం ఉపయోగించాలనేది దీని ఉద్దేశం అన్నారు.
కానీ 41.15 మీటర్లకు ప్రాజెక్టును తగ్గిస్తూ బడ్జెట్లో ప్రతిపాదనలు పెట్టారని మిథున్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. దీనివల్ల పోలవరం కెపాసిటీ 194 నుంచి 115 టీఎంసీలకు పడిపోతుందన్నారు. ఇది రైతులకు, రాష్ట్రానికి తీరని అన్యాయం అన్నారు. ఈ అన్యాయం ఎదిరించేందుకు టిడిపి ఎంపీలతో కలిసి పోరాటానికి సిద్ధం అని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. లేకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్షమించరన్నారు. 115 టీఎంసీలకు పోలవరాన్ని తగ్గించడం వల్ల కేవలం 3.2 లక్షల ఎకరాలకి నీరు అందుతుందన్నారు.