వరద బాధితులకు ‘మేఘా’ సంస్థ భారీ విరాళం

ఏపీ వరద బాధితులకు మేఘా సంస్థ రూ.5 కోట్ల భారీ విరాళం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన చెక్కును సీఎం చంద్రబాబుకు ఆ సంస్థ ఎండీ కృష్ణారెడ్డి, డైరెక్టర్ సుబ్బయ్య కలిసి అందించారు. అలాగే లలిత జువెలరీ మార్ట్ అధినేత కిరణ్ రూ.కోటి సాయం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును ఆయన సీఎంకు ఇచ్చారు. జీఎంఆర్ సంస్థ రూ.2.5 కోట్ల విరాళం ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన బాధితులకు అండగా నిలిచేందుకు ఎంతోమంది ముందుకు వస్తున్నారు. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు, విద్యా సంస్థలు మానవత్వాన్ని చాటుకుంటున్నారు.. భారీగా విరాళాలు అందజేస్తున్నారు. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు, విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేష్‌కు పలువురు చెక్కుల్ని అందించారు. జీఎమ్మార్‌ సంస్థకూడా రూ. 2.5 కోట్ల విరాళమిచ్చింది.. ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ చల్లా ప్రసన్న, సీఈవో మనోమేరాయ్‌తో కలిసి ఆ‌ చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళాన్ని అందజేసింది. ఈ మేరకు ఏఐజీ హాస్పిటల్స్‌ ఛైర్మన్‌ డా.డి.నాగేశ్వరరెడ్డి వైస్‌ ఛైర్మన్‌ పీవీఎస్‌ రాజు ఆన్‌లైన్‌ ద్వారా సీఎం సహాయనిధికి విరాళాన్ని బదిలీ చేశారు. అలాగే మెప్మా (పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ) తరఫున ఐఏఎస్‌ తేజ్‌భరత్‌ రూ.కోటి విరాళాన్ని అందజేశారు.