కేరళలో పెను విషాదం..కొండచరియలు విరిగి 19 మంది మృతి

కేరళలో కుండపోత వర్షాల కారణంగా పెను విషాదం చోటుచేసుకుంది. వయనాడ్ సమీపంలోని మెప్పాడిలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 19 మంది మరణించారు. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సమాచారం అందుకున్న NDRF సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేరళ సీఎం విజయన్తో మాట్లాడి అవసరమైన సాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు మోదీ ట్వీట్ చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడూ సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సానుభూతి తెలియజేశారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలను ట్విట్టర్ వేదికగా ఆదేశించారు. ఇక ఈ ఘటనలో మరణించిన వారిలో ముగ్గురు చిన్నారులతో పాటు ఓ ఫారినర్ ఉన్నట్లు సమాచారం. శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం సహాయక బృందాలు అన్వేషిస్తున్నాయి. కాగా నాలుగు గంటల వ్యవధిలోనే 3 సార్లు కొండచరియలు విరిగి పడటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

కేరళలో కొద్దిరోజులుగా ఏకధాటిగా అతి భారీ వర్షాలు కురుస్తోన్న విషయం తెలిసిందే. ప్రత్యేెకించి- కేరళ ఉత్తరప్రాంతంలో వర్షాల తీవ్రత అధికంగా ఉంటోంది. చెరువులు, కుంటలు, కాల్వలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల తాకిడికి వాయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. జిల్లాలోని మెప్పాడి, ముండక్కై టౌన్, చూరల్‌మాలా గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొండచరియలు విరిగి జనావాసాల మీద పడ్డాయి. అదే సమయంలో బురద ప్రవాహం ఆయా గ్రామాలను ముంచెత్తింది. అర్ధరాత్రి దాటిన తరువాత ఒంటిగంటకు తొలి దుర్ఘటన సంభవించింది. ముండక్కై టౌన్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. తెల్లవారు జామున 4 గంటల సమయంలో చూరల్‌మాలాలో రెండో ప్రమాదం చోటు చేసుకుంది.