కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారు వెలసిన శేషాచలం అడవులు అగ్ని ప్రమాదం బారిన పడ్డాయి. తిరుమల సమీపంలో కార్చిచ్చు చెలరేగాయి.అడవుల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. తిరుమల సమీపంలోని పాప వినాశనం డ్యామ్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. క్రమంగా మంటలు విస్తరించాయి. కుమారధార, పసుపుధార మంటలు వ్యాపించాయి.సమాచారం అందిన వెంటనే చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య రాయచోటి జిల్లాల అటవీ శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. మంటలు వ్యాప్తి చెందకుండా తక్షణ చర్యలు చేపట్టారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు మంటలను ఆర్పివేసే ప్రక్రియ చేపట్టారు. ఎండ తీవ్రతే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా అంచనావేశారు.
ఫారెస్ట్ రేంజ్
దీనిపై అటవీ మంత్రిత్వ శాఖను పర్యవేక్షిస్తోన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరా తీశారు. తిరుమల శేషాచల అడవుల్లో ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా మంటలు చెలరేగిన ఘటనపై అటవీశాఖ అధికారులు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫీసర్ పీసీ నాయక్, ఫారెస్ట్ అడ్వైజర్ మల్లికార్జున్తో ఆయన ప్రత్యేకంగా సమీక్షించారు. అన్నమయ్య జిల్లా బాలపల్లి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని ఓ గ్రామంలో తొలుత మంటలు చెలరేగినట్లు వెల్లడించారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు ధృవీకరించారు. తిరుపతి, అన్నమయ్య జిల్లాల నుండి సబ్ డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ సుబ్బరాజు నేతృత్వంలో ఫారెస్ట్ రేంజ్ అధికారులు, 30 మంది సిబ్బంది, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు అప్రమత్తమై మంటలను ఆర్పే ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. కార్చిచ్చును అదుపులోకి తెస్తున్నామని వివరించారు.

సంచరించే
మంటలు ఉధృతంగా వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు చేపట్టాలని, అదేవిధంగా వేసవి తాపానికి కార్చిచ్చులు రగిలే అవకాశం ఎక్కువగా ఉండటంతో, ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని రకాలుగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశించారు.వన్యప్రాణులు అధికంగా సంచరించే ప్రాంతం కావడంతో, వాటికి ఎటువంటి ప్రాణహాని జరగకుండా చూసుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు. వన్యప్రాణుల సంరక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అదే విధంగా మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న అటవీ శాఖ సిబ్బందిని, అగ్నిమాపక సిబ్బందిని, అధికారులను ప్రత్యేకంగా అభినందించారు.
Read Also: Revanth Reddy: మరి కాసేపట్లో ఢిల్లీకి రేవంత్ రెడ్డి పయనం