భారీ ఎన్‌కౌంటర్‌.. 10 మంది మావోయిస్టులు హతం

Massive encounter in Chhattisgarh.. 10 Maoists killed

న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌ లో మంగళవారం భారీ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. బీజాపూర్‌ – దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో చోటు చేసుకున్న ఈ ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఆ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న ముందస్తు సమాచారంతో భద్రతా బలగాలు ఆపరేషన్‌ ప్రారంభించారు. సోదాల సమయంలో భద్రతా బలగాలకు మావోలు తారసపడ్డారు. ఈ క్రమంలో అక్కడ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకూ 10 మంది నక్సలైట్లు హతమైనట్లు సమాచారం. ప్రస్తుతం అక్కడ ఆపరేషన్‌ కొనసాగుతోంది. మృతి చెందిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

‘దంతెవాడ – బీజాపూర్‌ జిల్లా సరిహద్దు ప్రాంతంలో వెస్ట్‌ బస్తర్‌ డివిజన్‌కు చెందని మావోయిస్టుల ఉనికి గురించి సమాచారం అందింది. పోలీసులు అర్ధరాత్రి ఆ ప్రాంతంలో సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో మావోలు – పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం అక్కడ ఆపరేషన్‌ కొనసాగుతోంది’ అని దంతెవాడ పోలీసులు తెలిపారు.