కెనడా ఎన్నికల్లో లిబరల్స్ పార్టీ భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. దీంతో మార్క్ కార్నీ మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. మార్క్ కార్నీ భారత్తో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు గతంలో పలుమార్లు వెల్లడించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు
లిబరల్ పార్టీ ఘన విజయం నేపథ్యంలో మార్క్ కార్నీకి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇరు దేశాల మధ్య ప్రజాస్వామ్య విలువలు, చట్టబద్ధమైన పాలన పట్ల ఉన్న నిబద్ధతను ప్రస్తావిస్తూ, కెనడాతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు కలిసి పనిచేయడానికి భారత్ ఎదురుచూస్తోందని పేర్కొన్నారు.

భారత్-కెనడా మధ్య దెబ్బతిన్న సంబంధాలు
గత ప్రధాని జస్టిన్ ట్రూడో హయాంలో భారత్-కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా, ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో కెనడా ప్రభుత్వం భారత్పై నిరాధార ఆరోపణలు చేయడంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇరు దేశాలు దౌత్యవేత్తలను పరస్పరం బహిష్కరించుకునే వరకు వెళ్లింది. అనంతరం ట్రూడో సొంత పార్టీలోనే వ్యతిరేకత రావడంతో ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో మార్క్ కార్నీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. భారత్తో దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించడానికి, విభేదాలను పరిష్కరించడానికి కృషి చేస్తామని కార్నీ గతంలోనే సంకేతాలు ఇచ్చారు. భారత్తో కెనడియన్లకు వ్యక్తిగత, ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని ఆయన గుర్తించారు.
భారత్-కెనడా ద్వైపాక్షిక బంధం తిరిగి బలపడుతుంది
న్యూఢిల్లీతో దౌత్య, వాణిజ్య సంబంధాలను తిరిగి గాడిలో పెట్టడానికి చర్యలు తీసుకుంటామని కార్నీ హామీ ఇవ్వడం ఇరు దేశాల మధ్య సహకారానికి, ముఖ్యంగా వాణిజ్య బలోపేతానికి, కెనడాలో విద్యను అభ్యసించే భారతీయ విద్యార్థులకు సానుకూల పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు. కార్నీ నాయకత్వంలో భారత్-కెనడా ద్వైపాక్షిక బంధం తిరిగి బలపడుతుందని ఆశిస్తున్నారు.
Read Also: Khawaja Asif: పాక్ రక్షణ మంత్రి ఎక్స్ అకౌంట్ ను నిలిపివేసిన ఇండియా