తిరుమల శ్రీవారి సేవలో మహేశ్ బాబు ఫ్యామిలీ

తిరుమల శ్రీవారిని మహేశ్ బాబు భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కుమార్తె సితార దర్శించుకున్నారు. ఈరోజు తెల్లవారుజామున శ్రీవారి సుప్రభాత సేవలో కుటుంబ సమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. అంతకుముందు నమ్రత, గౌతమ్, సితార మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకున్నారు.

బుధవారం రాత్రి అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమలకు చేరుకున్నారు. మార్గమంతా భక్తులు నమ్రత, గౌతమ్, సీతారాలతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. భక్తులతో సెల్ఫీలు దిగుతూ నడక మార్గం గుండా తిరుమలకు చేరుకున్నారు. అనంతరం తిరుమలలోని పద్మావతి నగర్ లోని విఐపి గెస్ట్ హౌస్ లో రాత్రి బస చేశారు. అనంతరం గురువారం సుప్రభాత సేవలో పాల్గొనటం విశేషం. సూపర్ స్టార్ కృష్ణ మరణం అనంతరం మహేష్ బాబు కుటుంబ సభ్యులు తిరుమలకు రావడం ఇదే మొదటి సారి.

అలాగే వరుణ్ తేజ్ దంపతులు కూడా శ్రీవారి దర్శనం చేసుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామి వారిని దర్శించుకున్న వరుణ్ తేజ్ దంపతులు మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం తర్వాత వరుణ్ తేజ్ దంపతులకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.