అమరావతి: టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే “మహానాడు” కార్యక్రమాన్ని ఈసారి కడపలో నిర్వహించాలని నిర్ణయించారు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన శుక్రవారం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం పొలిట్ బ్యూరోలో తీసుకున్న నిర్ణయాలను పార్టీ సీనియర్ నేత, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఈ ఏడాది తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని కడప జిల్లాలో మూడు రోజుల పాటు నిర్వహించాలని పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని అచ్చెన్నాయుడు తెలిపారు. మహానాడు తేదీలను ఖరారు చేసినట్లు చెప్పారు. మే 27, 28 తేదీల్లో మహానాడు తీర్మానాలు, 29న భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. మహానాడులో జాతీయ పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబును ఎన్నుకుంటామని వెల్లడించారు.

ఈ మహానాడుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వైసీపీ హయాంలో కుదించిన స్థానిక సంస్థల్లో బీసీ కోటా రిజర్వేషన్లు పునరుద్దరించేందుకు చట్టపరమైన అంశాలు పరిశీలించాలని టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది. మరోవైపు జిల్లాల పునర్విభజనపై సైతం చర్చ జరిగింది. వైసీపీ హయాంలో జిల్లాల పునర్విభజన అంశంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దాలని టీడీపొ పొలిట్ బ్యూరో నిర్ణయించినట్లు తెలుస్తోంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగత ఎన్నికలు మహానాడులోపు నిర్వహించాలని పొలిట్ బ్యూరో నిర్ణయించింది. కోటి సభ్యత్వాలు దాటిన నేపథ్యంలో ఈ నమోదు మరింత ముందుకుసాగాలని టీడీపీ పొలిట్ బ్యూరో స్వాగతించింది.