ప్రయాగ్రాజ్: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరొందిన మహా కుంభమేళా ఘనంగా ప్రారంభమైంది. గంగా, యమునా, సరస్వతీ నదులు కలిసే ప్రదేశమైన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు భక్తులు పోటెత్తారు. పుష్య పౌర్ణమి అయిన సోమవారం తెల్లవారుజాము నుంచే లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. సంక్రాతి నుంచి శివరాత్రి వరకు అంటే జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి కోట్ల మంది భక్తులు, పర్యాటకులు తరలి రానున్నారు.

సుమారు 45 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు చేయడానికి వస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తున్నది. ఇక సోమవారం ఉదయం 8 గంటల వరకు సుమారు 40 మందికిపైగా భక్తులు త్రివేణి సంగమంలో షాహీ స్నాన్ చేసినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నారు. దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశీ పౌరులు కూడా పుణ్య స్నానాలు చేస్తున్నారు. సాధువులు లక్షలాదిగా తరలివస్తున్నారు.
కాగా, 45 రోజులపాటు సాగనున్న మహా కుంభమేళాకు యూపీ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. భారీగా పోలీసు, భద్రతా బలగాలను మోహరించడంతోపాటు అడుగడుగునా సీసీ కెమెరలాను ఏర్పాటు చేసింది. డ్రోన్ కెమెరాలతో పరిస్థితులను పరిశీలిస్తున్నది. భక్తులకు సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.7 వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. ఎన్డీఆర్ఎఫ్ వాటర్ అంబులెన్స్లను ఏర్పాటు చేసింది. 10 వేల ఎకరాల పరిధిలో ఆధ్యాత్మిక నగరాన్ని ఏర్పాటు చేశారు. యాత్రికులకు ఇబ్బంది లేకుండా 1.6 లక్షల టెంట్లను, 1.5 లక్షల మరుగు దొడ్లను నిర్మించారు. భద్రత కోసం 55 పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయడంతోపాటు 45 వేల మంది పోలీసులను మోహరించారు.
కార్యక్రమానికి హాజరయ్యే భక్తులు, పర్యాటకుల కోసం ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నది. మహా కుంభ్కు వచ్చే ప్రయాణికుల సౌలభ్యం కోసం రైల్వే ప్రత్యేక సన్నాహాలు చేసింది. ఇందులో 24 గంటల వార్ రూమ్ ఒకటి. సమీపంలోని అన్ని స్టేషన్లలో సీసీకెమెరాలు, బహుభాషా కమ్యూనికేషన్ వ్యవస్థ, అదనపు టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేసింది. రైల్వే బోర్డు స్థాయిలో ప్రత్యేక ‘వార్ రూమ్’ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు బోర్డు ప్రచార కార్యనిర్వాహక డైరెక్టర్ దిలీప్కుమార్ పేర్కొన్నారు. 24 గంటలు పని చేస్తుందని.. అందులో ఆపరేషన్స్, బిజినెస్, ఆర్పీఎఫ్, ఇంజినీరింగ్, విద్యుత్ విభాగాల అధికారులు కార్యకలాపాలను పర్యవేక్షించడంతో పాటు సమన్వయం చేస్తారని చెప్పారు.
ప్రయాగ్రాజ్ ప్రాంతంలోని తొమ్మిది స్టేషన్లలో రియల్ టైమ్ పర్యవేక్షణ కోసం 1,176 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రయాణికుల కోసం 12 భాషల్లో ప్రకటన వ్యవస్థను ప్రారంభించారు. కుంభమేళా సమయంలో పదివేల సాధారణ రైళ్లు, 3,134 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఇది గత కుంభమేళా కంటే 4.5 రెట్లు ఎక్కువ. స్వల్ప దూరానికి 1,896 రైళ్లు, 706 దూర ప్రాంతాలకు, మరో 559 రింగ్ ట్రైన్స్ నడిపించనున్నట్లు రైల్వేశాఖ వివరించింది.