ఐపీఎల్ 2025 సీజన్లో శనివారం డబుల్ హెడర్లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్లో లక్నో సూపర్జెయింట్స్ 2 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్పై ఉత్కంఠ విజయం సాధించింది.ఆఖరి ఓవర్లో విజయానికి 9 పరుగులు అవసరమైన దశలో లక్నో పేసర్ అవేశ్ఖాన్ అద్భుతం చేశాడు. హెట్మైర్(12)ను ఔట్ చేసిన అవేశ్ 6 పరుగులే ఇచ్చుకుని లక్నోకు అదిరిపోయే విజయాన్ని అందించాడు. దీంతో 181 పరుగుల లక్ష్యఛేదనలో రాజస్థాన్ 20 ఓవర్లలో 178/5 కు పరిమితమైంది. యశస్వీ జైస్వాల్ (52 బంతుల్లో 74, 5 ఫోర్లు, 4 సిక్సర్లు) సూపర్ ఫామ్ను కొనసాగించగా కెప్టెన్ రియాన్ పరాగ్ (39) మెరిశాడు. ఈ మ్యాచ్లో అరంగేట్రం చేసిన 14 ఏండ్ల చిన్నోడు వైభవ్ సూర్యవంశీ (20 బంతుల్లో 34, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఐపీఎల్లో తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత ఓవర్లలో 180/5 పరుగులు చేసింది. మార్క్మ్ (45 బంతుల్లో 66, 5 ఫోర్లు, 3 సిక్సర్లు), అయుశ్ బదోని (34 బంతుల్లో 50, 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.
బదోని
జోరు మీదున్న మిచెల్ మార్ష్ (4)ను మూడో ఓవర్లోనే ఆర్చర్ పెవిలియన్కు పంపి రాయల్స్కు తొలి బ్రేక్నిచ్చాడు. ఆరెంజ్ క్యాప్ వీరుడు నికోలస్ పూరన్ (11)ను సందీప్ శర్మ వికెట్ల ముందు బలిగొనగా కెప్టెన్ పంత్ (3) వైఫల్య ప్రదర్శన దిగ్విజయంగా కొనసాగింది. 54 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో లక్నోను మార్క్మ్, బదోని ఆదుకున్నారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్కు 76 రన్స్ జోడించారు. 31 బంతుల్లో మార్క్మ్ అర్ధశతకాన్ని పూర్తిచేశాక బ్యాట్ ఝుళిపించాడు. మరో ఎండ్లో బదోని కూడా వేగంగా ఆడాడు. అయితే ఈ ఇద్దరూ స్వల్ప వ్యవధిలో నిష్క్రమించినా ఆఖర్లో అబ్దుల్ సమద్ (10 బంతుల్లో 30 నాటౌట్, 4 సిక్సర్లు) మెరుపులతో లక్నో పోరాడగలిగే స్కోరును సాధించింది.

తాత్కాలిక
జైస్వాల్తో పాటు క్రీజులోకి వచ్చిన పాలబుగ్గల పసివాడు వైభవ్ ఈ లీగ్లో తాను ఆడిన మొదటి బంతినే భారీ సిక్సర్ కొట్టాడు.శార్దూల్ వేసిన గుడ్ లెంగ్త్ బంతిని కవర్స్ దిశగా సిక్స్ బాదాడు.అవేశ్ బౌలింగ్లోనూ సిక్స్ కొట్టిన వైభవ్ జైస్వాల్తో కలిసి తొలి వికెట్కు 8.4 ఓవర్లలో 85 పరుగులు జోడించి ఆ జట్టుకు శుభారంభాన్ని అందించాడు. శార్దూల్ 3వ ఓవర్లో 4 ,6తో బాదుడు మొదలుపెట్టిన జైస్వాల్ మార్క్మ్ ఓవర్లోనూ రెండు సిక్సర్లతో అలరించాడు. మార్క్మ్ 9వ ఓవర్లో దురదృష్టవశాత్తూ వైభవ్ స్టంపౌట్గా వెనుదిరిగగా రాణా (8) సైతం నిరాశపరిచాడు. కానీ తాత్కాలిక సారథి పరాగ్తో జతకలిసిన జైస్వాల్ లక్నోకు ఎలాంటి అవకాశమివ్వలేదు. 31 బంతుల్లోనే ఈ సీజన్లో వరుసగా మూడో హాఫ్ సెంచరీ చేశాడు. ఆఖర్లో అవేశ్ జైస్వాల్, పరాగ్ను ఔట్ చేయడంతో పాటు చివరి ఓవర్లోనూ రాయల్స్ను కట్టడి చేస్తూ లక్నోకు విజయాన్ని కట్టబెట్టాడు. దీంతో వరుసగా నాలుగో మ్యాచ్లో ఓడిన రాయల్స్ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత క్లిష్టం చేసుకుంది.
Read Also: IPL 2025 : సూపర్ సండే.. ఇవాళ కీలక మ్యాచ్లు