న్యూఢిల్లీ : పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటాపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అందుకు సుప్రీం కోర్టు ధర్మాసనం అనుమతించింది. పీజీ మెడికల్ సీట్లలో స్థానిక కోటా చెల్లదంటూ ఇటీవల జస్టిస్ సుధాంశు దులియా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చింది.

ఈ నేపథ్యంలో తమ పిటీషన్పై విచారణను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. దాంతో విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలంటే.. ముందు తాము విచారణ చేపడతామని జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ క్రమంలో తదుపరి విచారణ ఏప్రిల్ 4వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం పేర్కొంది.
ఆర్టికల్ 371(డి) అనుసరించి.. ఆంధ్రప్రదేశ్లో ఎంబీబిఎస్ చేసిన విద్యార్ధులకూ పీజీలో స్థానికత కోటాలో సీట్లు కేటాయించాలంటూ దాదాపు 100 మంది జూనియర్ వైద్యులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రల్లో పీజీ మెడికల్ సీట్లలో స్థానిక కోటా వర్తిస్తుందని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. ఇక విభజన అనంతరం ఆర్టికల్ 371(డి) పదేళ్ల పాటు మాత్రమే వర్తింపజేయాలన్ననిబంధన ఉందన్న తెలంగాణ వాదనను తెలంగాణ హైకోర్టు ఈ సందర్భంగా పరిగణలోకి తీసుకోలేదు.