ఎమ్మెల్యే యాదయ్యకు షాకిచ్చిన సొంత పార్టీ నేతలు

చెవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యకు చేదు అనుభవం ఎదురైంది. సొంత పార్టీ నేతలే ఆయనకు షాకిచ్చారు. బుధవారం కాలె యాదయ్య కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కోసం షాబాద్‌కు వెళ్లగా..ఆయనకు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలు తిరగబడ్డారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ నానా రభస చేసారు. చేవెళ్ల కాంగ్రెస్ ఇంచార్జ్‌గా ఉన్న భీమ్ భరత్‌ వర్గాన్ని తన వెంట కలుపుకుని పోవట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.

మొదటి నుంచి పార్టీలో ఉండి కష్టపడ్డామని నేడు ఎమ్మెల్యే అవ్వగానే పాత నాయకులను ఎలా మర్చిపోతారంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల వారు బాహాబాహీకి దిగేందుకు ప్రయత్నించగా.. సమయానికి అక్కడే ఉన్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. ఓ దశలో భరత్ వర్గీయులు ఎమ్మెల్యే కాలె యాదయ్య వాహనంపై కోడిగుడ్లతో దాడి చేశారు.