మణిపూర్‌ గవర్నర్‌గా లక్ష్మణ్‌ ప్రసాద్‌ ప్రమాణస్వీకారం

Laxman Prasad sworn in as Governor of Manipur

ఇంఫాల్‌ : మణిపూర్‌ గవర్నర్‌గా లక్ష్మణ్‌ ప్రసాద్‌ ఆచార్య ప్రమాణస్వీకారం చేశారు. మణిపూర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సిద్ధార్థ్‌ మృదుల్‌ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లోని రాజ్‌భవన్‌లోగల దర్బార్‌ హాల్‌లో ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఇప్పటివరకు మణిపూర్‌ గవర్నర్‌గా పనిచేసిన అనసూయ ఉయికే పదవీకాలం ముగియడంతో ఆమె స్థానంలో నూతన గవర్నర్‌ను నియమించారు.

కాగా, లక్ష్మణ్‌ ప్రసాద్‌ ఆచార్య మంగళవారం (జూలై 30న) అసోం గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. అసోం రాజధాని గువాహటిలోని శ్రీమంత శంకర్‌దేవ కళాక్షేత్రలో ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. అసోం హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఆయన చేత గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేయించారు. ఇప్పుడు మణిపూర్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

అసోం గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మంగళవారం సాయంత్రం ఇంఫాల్‌కు చేరుకున్న లక్ష్మణ్‌ ప్రసాద్‌ ఆచార్యకు మణిపూర్ సీఎం బీరెన్‌ సింగ్‌ ఘన స్వాగతం పలికారు. ఆ రాష్ట్ర మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు కూడా ఈ స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు.