నేడు సుప్రీంకోర్టులో ‘లాపతా లేడీస్‌ ‘ ప్రదర్శన

‘Laapataa Ladies’ performance in Supreme Court today

న్యూఢిలీ: బాలీవుడ్‌ చిత్రం ‘లాపతా లేడీస్‌ ‘ను నేడు సుప్రీంకోర్టులో ప్రదర్శించనున్నారు. ఈ సినిమాను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ సహా న్యాయమూర్తులు, వారి కుటుంబసభ్యులు, ఇతర రిజిస్ట్రీ అధికారులు కలిసి వీక్షించనున్నారు. సుప్రీంకోర్టు ఆవిర్భవించి 75 ఏళ్లు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం 4.15 గంటల నుంచి 6.20 గంటల వరకు అడ్మినిస్ట్రేటివ్‌ భవనంలోని సి-బ్లాక్‌లో గల ఆడిటోరియంలో ‘లాపతా లేడీస్‌’ సినిమాను ప్రదర్శించనున్నట్లు ఓ సర్క్యులర్‌ విడుదల చేశారు. ఈ స్క్రీనింగ్‌కు ప్రముఖ నటుడు ఆమిర్‌ ఖాన్‌, దర్శకురాలు కిరణ్‌ రావ్‌ కూడా రానున్నట్లు అందులో పేర్కొన్నారు.

కిరణ్‌రావ్‌ దర్శకత్వంలో ఆమిర్‌ ఖాన్‌ తన సొంత బ్యానర్‌పై తెరకెక్కించిన సినిమానే ‘లాపతా లేడీస్‌ ‘. 2001లో గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువ వధువులు రైలు ప్రయాణంలో తప్పిపోయిన సంఘటన ఇతివృత్తంగా దీన్ని తెరకెక్కించారు. లింగ సమానత్వాన్ని చాటిచెప్పే ఈ కామెడీ డ్రామా ఫిల్మ్‌.. ఈ ఏడాది మార్చిలో విడుదలై సినీ ప్రముఖులు, విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందనలకే పరిమితమైనా ఓటీటీలో సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. అంతేకాకుండా విడుదలకు ముందుగానే సెప్టెంబరు 8న ఈ సినిమాను ప్రతిష్ఠాత్మక టోరంటో ఇంటర్‌నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (టీఐఎఫ్‌ఎఫ్‌) వేడుకలో ప్రదర్శించారు. ఈ వినోదభరితమైన చిత్రంలో నితాన్షీ గోయల్‌, ప్రతిభా రంతా, స్పర్శ్‌ శ్రీవాస్తవ, ఛాయా కదమ్‌, రవికిషన్‌ కీలక పాత్రలు పోషించారు.