అమృత్ టెండర్ల పై కేంద్రానికి కేటీఆర్ లేఖ

KTR

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అమృత్‌ టెండర్ల అంశంలో అవినీతి జరిగిందంటూ ఆరోపిస్తూ కేంద్రానికి లేఖ రాశారు. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు మనోహల్‌లాల్‌ కట్టర్‌.. టోచన్‌ సాహూలకు కేటీఆర్‌ లేఖ రాశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత బావమరిది సృజన్‌రెడ్డికి, తమ్ముడి కంపెనీలకు అర్హతలు లేకున్నా కాంట్రాక్టులు కట్టబెట్టారని కేటీఆర్‌ లేఖలో ప్రస్తావించారు. వందల కోట్ల రూపాయల కాంట్రాక్టులను అప్పనంగా దక్కించుకున్న సీఎం కుటుంబీకుల వ్యవహారంపైన నిజాలు నిగ్గు తేల్చాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. గత తొమ్మిది నెలల్లో రాష్ట్రంలో జరిగిన టెండర్ల తాలూకా సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తొక్కిపెడుతుందని ఆరోపించారు. అమృత్‌ పథకంలో జరిగిన ప్రతీ టెండర్‌, పనులు దక్కించుకున్న కంపెనీల వివరాలను బహిర్గతం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అవినీతి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన ప్రతీ టెండర్‌ను సమీక్షించి, ఈ చీకటి టెండర్లను రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు. వెంటనే టెండర్ల తాలూకా ప్రతీ సమాచారాన్ని ప్రజల ముందు పారదర్శకంగా ఉంచాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

అర్హతలు లేకున్నా అమృత్‌ టెండర్లు దక్కించుకున్న కంపెనీలపైనా ఎంక్వయిరీ వేయాలని కేటీఆర్‌ అన్నారు. ఆరు నెలలుగా ప్రతిపక్ష పార్టీలు డిమాండ్‌ చేసినా, స్పష్టత ఇవ్వలేదని తెలంగాణ ప్రభుత్వ తీరుపై కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ స్పందించకుంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతిలో కేంద్రానికి కూడా భాగస్వామ్మం ఉందని ప్రజలు నమ్మాల్సి వస్తుందని కేటీఆర్‌ లేఖలో పేర్కొన్నారు.