రుణమాఫీ తో రేవంత్ మోసం – కేటీఆర్ ట్వీట్

నేడు తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు రూ.లక్షలోపు రైతు రుణాలు మాఫీ చేయనుంది. సాయంత్రం 4 గంటలక రుణమాఫీ ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ రుణమాఫీ ఫై రేవంత్ తీరు ఫై కేటీఆర్ ట్వీట్ చేసారు.

రైతుబంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధులలోంచే రూ.7000 కోట్లు రుణమాఫీకి దారిమళ్లించారని కేటీఆర్ ఆరోపించారు. హక్కుగా రావాల్సిన రైతుబంధు డబ్బు నుండి కొంతమొత్తం విదిల్చి, రుణమాఫీ చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం ఫోజులు కొడుతోందన్నారు. 40 లక్షల పైచిలుకు రైతులు లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందినే ఎట్లా ఎంపిక చేస్తారని ఆయన ప్రశ్నించారు. 2014, 2018లో కేసీఆర్ సర్కార్ రుణమాఫీతో పోలిస్తే పావు వంతు రైతులకే అర్హతనా అన్నారు.

2014లోనే కేసీఆర్ సర్కార్ లక్షలోపు రుణాలను మాఫీ చేయడానికి రూ.16,144 కోట్లు వెచ్చించి సుమారు 35 లక్షల రైతులకు లబ్ది చేకూర్చిందని గుర్తు చేశారు. 2018లో అదే లక్షలోపు రుణమాఫీకి రూ. 19,198 కోట్లు అంచనా కాగా మొత్తం లబ్దిదారుల సంఖ్య సుమారు 37 లక్షలు అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు రూ. 2 లక్షల వరకూ ఉన్న పంటరుణాలు అన్నీ వెంటనే మాఫీ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అర్హులైన అందరు రైతులకు రైతుబంధు విడుదల చేయాలని కోరారు.

ఈరోజు 11.50 లక్షల మంది రైతుల రుణ ఖాతాల్లోకి నిధులు జమ కానున్నాయి. ఇప్పటికే బ్యాంకులకు ఆర్థిక శాఖ నిధులు జమ చేసింది. ఆగస్టు పూర్తయ్యేలోపు 3 దశల్లో రైతుల రుణమాఫీ ప్రక్రియ జరగనుంది. ఈ నెలఖారులోపు రూ.1.50 లక్షల వరకు ఉన్న రుణాలు మాపీ కానున్నాయి. ఆగస్టు 15 నాటికి రూ.2లక్షల వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ కానున్నాయి. కుటుంబాన్ని నిర్ధారించేందుకే ప్రామాణికంగా రేషన్ కార్డును చూడనున్నారు.