సీఎం రేవంత్ అబద్దాలు చూసి గోబెల్స్ తన సమాధిలో ఉలిక్కిపడ్డారు – కేటీఆర్

ktr

సీఎం రేవంత్ రెడ్డిపై, ఆయన చెబుతున్న అబద్ధాలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్, ఆయన ప్రభుత్వం చేస్తున్న అబద్ధాల ప్రచారం చూసి జోసెఫ్ గోబెల్స్ కూడా తన సమాధిలోనే తలదించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయన్నారు. తెలంగాణలో బొగ్గు బ్లాకుల అమ్మకాలను బీఆర్ఎస్ వ్యతిరేకించిందన్నారు. బొగ్గు గనుల వేలంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాల్గొన్నదని గుర్తు చేశారు. కానీ తాము మాత్రం ఎప్పుడూ పాల్గొనలేదన్నారు. చివరి రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వం రెండు బ్లాక్‌లను ఏకపక్షంగా వేలం వేసిందని ఆరోపించారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వినకుండా వాటిని క్రూరంగా అణిచి, వేల మందిని చంపిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. ముఖ్యమంత్రి గద్దెపై రేవంత్ ఎక్కిన తర్వాత కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టుపెడుతున్న తీరు ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు గమనిస్తున్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజల హక్కులను, ఆస్తులను, వనరులను తాకట్టు పెట్టడంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు తోడుదొంగల్లా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే నదీ జలాల వాటాను వదులుకున్న కాంగ్రెస్ తీరును రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారని చెప్పారు. తాజాగా బీజేపీకి అందిస్తున్న సహకారంతో సింగరేణి సంస్థను ప్రైవేటుపరం చేయాలన్న కుట్ర అందరికీ తెలిసిపోయిందని వెల్లడించారు. గనుల వేలంలో పాల్గొన్న మిమ్మల్ని, మీ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని తెలంగాణ చరిత్ర క్షమించదని ఆగ్రహం వ్యక్తంచేశారు.