తెలంగాణ రాజకీయాల్లో తాజా సంచలనంగా మారిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను టార్గెట్ చేశాయి. కాంగ్రెస్ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఓ రేంజ్లో స్పందిస్తూ, కేటీఆర్పై ఘాటుగా విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ప్రజలకు గత పది సంవత్సరాల పాలనలో జరిగిన అన్యాయాన్ని గుర్తుచేస్తూ, ఇప్పటి ప్రభుత్వంపై విమర్శలు చేయడం బాధాకరమని అన్నారు. ఓ దశలో నేరుగా హెచ్చరించారు. నోరు అదుపులో పెట్టుకో బిడ్డా లేకపోతే నాలుక కోస్తాం అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది కేటీఆర్కు వ్యతిరేకంగా వచ్చిన బలమైన రాజకీయ హెచ్చరికగా మారింది.

బీర్ల ఐలయ్య ఫైర్
కేటీఆర్ వ్యాఖ్యలు చిల్లర రాజకీయాలకు ఉదాహరణ అని, ఆయన తీరులో మార్పు రాకపోతే ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం చెప్పబోతున్నారని ఐలయ్య అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను, మంత్రులు తమ 15 నెలల పాలనలో సంక్షేమ పథకాలు సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్న ప్రస్తుత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ, అనవసర విమర్శలు చేయడం గర్హనీయమని ఆయన అభిప్రాయపడ్డారు. పింక్ మీడియా మరియు సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలహీన పరచాలనే కుట్రలు సాగుతున్నాయని బీర్ల ఐలయ్య ఆరోపించారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు అన్నారు. ముఖ్యంగా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు చందాలు ఇస్తాం అని మాట్లాడటం మామూలు విషయం కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు తమకు చందాలు ఇస్తామంటున్నారంటూ కేటీఆర్ సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం ఎవరి తరం కాదని అన్నారు. ఇకనైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని చెప్పారు.
Read also: Dr. Venkat Ram Narsaya: వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ డా.వెంకట్ రామ్ నర్సయ్య ఇక లేరు