బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఏడాదిలో ఉపఎన్నికలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంటూ అందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. అత్తాపూర్ డివిజన్ నుంచి వనం శ్రీరామ్ రెడ్డి సహా పలు పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు గత ఎన్నికల తర్వాత భారీ నష్టం జరిగిందని, ఆ నష్టాన్ని పూడ్చుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనన్నారు. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమని చెప్పారు.
బీఆర్ఎస్ ఓటమితో ప్రజలే ఎక్కువ నష్టపోయారు
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, గత పదేళ్ల కాలంలో కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమం రెండింటిని సమతుల్యంగా నడిపించారని అన్నారు. కానీ బీఆర్ఎస్ ఓటమితో ప్రజలే ఎక్కువ నష్టపోయారని ఆయన అభిప్రాయం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వల్ల రాష్ట్రానికి ప్రయోజనం కాకుండా, అనర్థమే జరిగిందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన గ్యారంటీల్లో ఒక్కటి కూడా అమలు కాలేదని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ రంగం క్షీణించిందని, మహిళలు బస్సుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
మత రాజకీయాలకు బీఆర్ఎస్ ఎప్పుడూ వ్యతిరేకం
రాష్ట్ర రాజకీయాలపై స్పందించిన కేటీఆర్, మత రాజకీయాలకు బీఆర్ఎస్ ఎప్పుడూ వ్యతిరేకమని స్పష్టం చేశారు. “మత పిచ్చి మంచిది కాదు, సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేయొద్దు” అంటూ హెచ్చరించారు. రెండు జాతీయ పార్టీలు – బీజేపీ, కాంగ్రెస్ – తెలంగాణ కు శత్రువులుగా వ్యవహరిస్తున్నాయన్నారు. కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రానికి మళ్ళీ ప్రగతిని తీసుకురాగలదని, ప్రజలు మరోసారి గులాబీ జెండాకే ఆశీర్వాదం ఇవ్వాలని కోరారు.