భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు దేశవ్యాప్తంగా భద్రతపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్న తెలుగు విద్యార్థుల భద్రతపై రాజకీయ నాయకులు తమ బాధ్యతను గుర్తించి చొరవ చూపుతున్నారు. తాజాగా, టీడీపీ పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయులు కీలకంగా స్పందించారు. వారిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చడానికి వీలుగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు ఆయన విజ్ఞప్తి చేశారు.

విద్యార్థుల భద్రతపై ఆందోళన:
హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, జమ్మూకశ్మీర్ లాంటి రాష్ట్రాల్లో పలు ప్రఖ్యాత విద్యాసంస్థల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నాన్నారని ఎంపీ తన లేఖలో ప్రస్తావించారు. ముఖ్యంగా నిట్ జలంధర్, నిట్ శ్రీనగర్, నిట్ కురుక్షేత్ర, మరియు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (LPU) వంటి క్యాంపస్లలో వందల సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు.
ఈ పరిస్థితిని పరిగణలోకి తీసుకుని, శ్రీకృష్ణదేవరాయులు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి ఓ లేఖ రాశారు. అందులో, విద్యార్థుల ప్రాణ భద్రతను అత్యంత ప్రాముఖ్యతగా పరిగణించి, తక్షణమే ప్రత్యేక రైలు సర్వీసులను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రత్యేకంగా ఢిల్లీ, చండీగఢ్ వంటి నగరాల నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లు నడిపితే విద్యార్థులకు ఎంతో ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు.
తల్లిదండ్రుల ఆందోళన
ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని శ్రీకృష్ణదేవరాయులు తెలిపారు. ఈ విద్యార్థులు తమ సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్లేందుకు వీలుగా ఢిల్లీ, చండీగఢ్ల నుంచి తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక రైలు సర్వీసులను నడపాలని ఆయన రైల్వే మంత్రిని కోరారు. తక్షణమే స్పందించి, విద్యార్థుల ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆయన తన లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.
Read also: Pawan Kalyan : భారత సైన్యంకి మద్దతుగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక పిలుపు