బల్కంపేట ఆలయంలో తోపులాట మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్​లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. మంత్రి కొండా సురేఖ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను అమ్మవారికి సమర్పించారు. ఈసారి స్వల్ప తోపులాట జరగడం వివాదంలో పడేసింది. ఆ తోపులాటలో మంత్రి పొన్నం చిక్కుకోవడంతో కలెక్టర్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు మంత్రి సురేఖ. హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హన్మంత రావు, జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి, హైదరాబాద్ కలెక్టర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, బల్కంపేట దేవాలయ ఈవో, రాష్ట్రస్థాయి బోనాల కమిటీ మెంబర్లు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఇక ఈ తోపులాట ఫై మంత్రి సురేఖ కీలక వ్యాఖ్యలు చేసారు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవంలో జరిగిన తోపులాట వెనుక కుట్ర కోణం ఉందని మంత్రి సురేఖ ఆరోపించారు. ఈ ఘటనపై పోలీస్ శాఖ ఇన్వెస్టిగేషన్ చేస్తుందని మంత్రి తెలిపారు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదన్నారు. తోపులాట ఘటనపై పోలీస్ శాఖ రేపటిలోగా నివేదిక సమర్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.