కొడాలి నాని మాజీ పీఏ ఫై గుర్తు తెలియని వ్యక్తులు దాడి

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని మాజీ పీఏ ఆచంట లక్ష్మోజీపై సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ప్రస్తుతం ఆయన మచిలీపట్నం కలెక్టరేట్‌లో పౌరసరఫరాల విభాగంలో పని చేస్తున్నాడు. నిన్న విధులు ముగించుకుని రైలులో గుడివాడకు వచ్చాడు. స్టేషన్ పక్కనే ఉన్న తన బైక్‌ను తీస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై దాడి చేశారు.

ఈ దాడిలో ఆయన తలకు బలమైన గాయం తగిలింది. తనపై దాడి చేసింది తనకు తెలియదని లక్ష్మోజీ చెబుతున్నాడు. అయితే, వైద్యం కోసం ఆయన ప్రభుత్వ ఆస్పత్రిలో చేరకుండా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. అతనిపై దాడి వ్యక్తిగత కారణాలా లేక రాజకీయ కక్షల కారణంగా జరిగిందా అనేది తెలియాల్సివుంది. ఈ దాడి విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ వెంటనే గుడివాడకు చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.