ప్రధాని మోడీ ఉక్రేయిన్‌ పర్యటన నేపథ్యంలో అమెరికా కీలక వ్యాఖ్యలు

biden

వాషింగ్టన్‌ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవలే యుద్ధ ప్రభావిత ఉక్రెయిన్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా కీలక ప్రకటన విడుదల చేసింది. రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య వివాదానికి ముగింపు పలికేందుకు సిద్ధంగా ఉన్న ఏ దేశానికైనా స్వాగతం పలుకుతామని పేర్కొంది. ఉక్రెయిన్ ప్రజల ప్రత్యేక హక్కులు, శాంతిని కోరుకుంటున్న అధ్యక్షుడు జెలెన్‌స్కీకి అనుగుణంగా కృషి చేయాలని, అలాంటి పాత్ర పోషించే దేశాన్ని తాము కచ్చితంగా స్వాగతిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు వైట్‌హౌస్ జాతీయ భద్రతా సమాచార సలహాదారు జాన్ కిర్బీ బుధవారం మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్‌లో పర్యటించిన ప్రధాని మోడీతో అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్‌లో మాట్లాడారు కదా? అని మీడియా ప్రశ్నించగా కిర్బీ ఈ సమాధానం ఇచ్చారు.

కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 23న ఉక్రెయిన్‌లో చారిత్రాత్మక పర్యటన చేశారు. ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. రష్యాతో వివాదం ముగింపునకు భారత్ తనవంతు సహకారాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారు. కాగా మోడీ ఉక్రెయిన్ నుంచి వచ్చిన తర్వాత ఆయనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్ చేసి మాట్లాడారు.