విశాఖలో ప్రభుత్వ భూముల కబ్జా ప్రయత్నం : కేశినేని నానిపై తీవ్ర ఆరోపణలు
మాజీ ఎంపీ, వైసీపీ నేత కేశినేని నాని తన సొంత తమ్ముడు, విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. విశాఖపట్నంలో ‘ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే కొత్త కంపెనీకి భారీగా ప్రభుత్వ భూములు కట్టబెట్టేందుకు చిన్ని ప్రయత్నిస్తున్నారని నాని ఆరోపించారు. పెట్టుబడుల పేరుతో ప్రజల సంపదను కొల్లగొట్టే కుట్ర వెనుక ఎంపీ చిన్ని ఉన్నారని నాని తీవ్రస్థాయిలో విమర్శించారు.
ఉర్సా క్లస్టర్స్ వ్యవహారం వెనుక గుట్టు రట్టు
విశాఖలో రూ. 5,728 కోట్ల విలువైన డేటా సెంటర్ ప్రాజెక్ట్ పేరిట ఉర్సా క్లస్టర్స్ సంస్థకు 60 ఎకరాల భూమిని కేటాయించేందుకు రంగం సిద్ధమైందని నాని తెలిపారు. ఇందులో ఐటీ పార్క్ ప్రాంతంలో 3.5 ఎకరాలు, కాపులుప్పాడ ప్రాంతంలో 56.36 ఎకరాలు ఉన్నాయని వివరించారు. ఈ ఉర్సా క్లస్టర్స్ సంస్థ కేవలం కొన్ని వారాల క్రితమే రిజిస్ట్రేషన్ తీసుకుందని, దీనికి ప్రాజెక్టులను నిర్వహించే అనుభవం గానీ, అవసరమైన ఆర్థిక స్థిరత్వం గానీ లేదని నాని స్పష్టం చేశారు. ఈ కంపెనీ భవిష్యత్తు అనుమానాస్పదంగా ఉందని, దీని ద్వారా ప్రభుత్వ భూమిని కొల్లగొట్టే కుట్ర జరుగుతోందని ఆయన హెచ్చరించారు.
ఎంపీ చిన్ని – ఉర్సా డైరెక్టర్ల మధ్య బంధం
ఉర్సా క్లస్టర్స్ డైరెక్టర్లలో ఒకరైన అబ్బూరి సతీష్, ఎంపీ కేశినేని చిన్ని ఇంజినీరింగ్ కాలేజీ తరగతి మిత్రుడే కాకుండా, వ్యాపార భాగస్వామి కూడా అని నాని ఆరోపించారు. గతంలో ఈ ఇద్దరూ కలిసి ’21st సెంచరీ ఇన్వెస్ట్మెంట్స్, ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసం చేసిన చరిత్ర ఉన్నదని నాని చెప్పారు. ఇప్పుడు అదే పద్ధతిలో ‘ఉర్సా క్లస్టర్స్’ ద్వారా ప్రభుత్వ భూమిని అన్యాయంగా సొంతం చేసుకునే కుట్ర జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు.
అధికార దుర్వినియోగం ఆరోపణలు
ఎంపీగా తన స్థానం, అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్ష పదవిని దుర్వినియోగం చేస్తూ చిన్ని ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని నాని పేర్కొన్నారు. ఇసుక, ఫ్లై యాష్, రియల్ ఎస్టేట్ మాఫియాలతో చిన్ని కుమ్మక్కై రాష్ట్రంలోని వనరులను అన్యాయంగా దోచుకుంటున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయని ఆరోపించారు. అధికార పీఠాన్ని ఉపయోగించి నిధులు తరలించడమే కాకుండా, ప్రభుత్వ భూములను కూడా బినామీ పద్ధతిలో తన కంట్రోల్కు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని నాని మండిపడ్డారు.
భూ కేటాయింపుల రద్దుకు డిమాండ్
ఉర్సా క్లస్టర్స్ సంస్థకు భూముల కేటాయింపును వెంటనే రద్దు చేయాలని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని నాని డిమాండ్ చేశారు. ఉర్సా క్లస్టర్స్ యజమానుల ఆర్థిక మూలాలు, వారి రాజకీయ సంబంధాలను బహిర్గతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పెట్టుబడుల ముసుగులో ప్రభుత్వ సంపదను కొల్లగొట్టే ఈ కుట్రను తక్షణమే అడ్డుకోవాలని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు నాని వెల్లడించారు. ప్రభుత్వ భూములు ప్రజలకు చెందాలని, కొన్ని వ్యక్తుల లాభాల కోసం వాటిని తక్కువ ధరకు కట్టబెట్టడం సహించదగిన చర్య కాదని ఆయన స్పష్టం చేశారు.
READ ALSO: K Annamalai: విజయసాయిరెడ్డి స్థానంలో రాజ్యసభకు అన్నామలై