సుప్రీంకోర్టు ను ఆశ్రయించిన కేజ్రీవాల్‌

Kejriwal approaches Supreme Court challenging arrest by CBI

న్యూఢిల్లీ: మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో అరెస్టయిన జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ తాజాగా సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు. సీబీఐ తనను అరెస్ట్‌ చేయడాన్ని దేశ అత్యున్నత న్యాయ స్థానంలో సవాల్‌ చేశారు. ఈ కేసులో కేజ్రీ రెగ్యులర్‌ బెయిల్‌ కోసం పిటిషన్‌ వేసినట్లు ఆప్‌ న్యాయ బృందం సోమవారం తెలిపింది. కాగా, మద్యం పాలసీ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు సోమవారం కొట్టివేసిన విషయం తెలిసిందే. బెయిల్‌ కోసం ట్రయల్‌ కోర్టును ఆశ్రయించాలని సూచించింది.

మద్యం కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలో కేజ్రీని ఈడీ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన తీహార్‌ జైల్లోనే ఉంటున్నారు. బెయిల్‌ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈడీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ.. ప్రస్తుతం సీబీఐ కేసులో తీహార్‌ జైలులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. మరోవైపు కేజ్రీ జ్యుడీషియల్‌ కస్టడీని ఈ నెల 20 వరకు పొడిగిస్తూ రౌస్‌ అవెన్యూ కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కస్టడీ గడువు ముగియడంతో సీబీఐ ఆయనను తిహార్‌ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టులో హాజరుపరిచారు.