ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ కు బయల్దేరిన ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్ ఫై విడుదలైన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ నుండి హైదరాబాద్ కు బయలుదేరారు. మంగ‌ళ‌వారం రాత్రి 9:12 గంట‌ల‌కు జైలు నుండి బయటకు వచ్చిన కవిత.. జైలు నుంచి బ‌య‌ట‌కు రాగానే అక్క‌డే ఉన్న త‌న కొడుకును ఆలింగ‌నం చేసుకొని భావోద్వేగానికి లోన‌య్యారు. ఆ త‌ర్వాత భ‌ర్త అనిల్‌, అన్న‌య్య కేటీఆర్‌ను గుండెల‌కు హ‌త్తుకుని ఆనందంతో కన్నీరు పెట్టుకుంది.

ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ.. తనను జైలులో వేసి ఐదున్నర నెలలు పిల్లలకు దూరం చేశారంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతకాలం పిల్లల్ని వదిలి ఉండటం అంత సులువైన విషయం కాదని అన్నారు. తనపై అక్రమంగా కేసులు పెట్టారని..బెయిల్ రాకుండా చేసారని..ఎవర్ని వదిలిపెట్టమని ..వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించింది. ‘నేను సాధారణంగా మొండిదాన్ని. ఇంకా నన్ను జగమొండిని చేశారు. ఏ తప్పు చేయకపోయినా రాజకీయ కక్షతో కావాలనే ఇబ్బందులు పెట్టారు. మూల్యం చెల్లించి తీరుతా’ అన్నారు.

కొద్దీ సేపటి క్రితం ఢిల్లీలోని తన నివాసం నుంచి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. సాయంత్రం వరకు ఆమె హైదరాబాద్‌ చేరుకుంటారు. కవిత వెంట ఆమె భర్త అనిల్, కేటీఆర్‌ ఉన్నారు. కాగా, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కవితకు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఎయిర్ పోర్ట్ నుండి తన నివాసం వరకు దాదాపు 500 కార్ల తో ర్యాలీగా రానున్నారు. ఢిల్లీలోని తన నివాసం నుంచి ఎయిర్‌పోర్టుకు బయల్దేరే ముందు ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. న్యాయం గెలిచిందని అని అన్నారు. తన పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు.