ఘోర ఉగ్రదాడిపై కాశ్మీర్ మీడియా అసాధారణ నిరసన
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఇటీవల జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడి దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ దాడిలో అత్యధికంగా పర్యాటకులు బాధితులయ్యారు. మొత్తం 28 మంది ప్రాణాలు కోల్పోగా, అనేకమంది గాయపడ్డారు. ఈ దారుణ ఘటనకు నిరసనగా కాశ్మీర్లోని ప్రధాన వార్తాపత్రికలు గతంలో ఎన్నడూ చేయని విధంగా తమ ఆవేదనను వ్యక్తపరిచాయి. బుధవారం ఉదయం, గ్రేటర్ కాశ్మీర్, రైజింగ్ కాశ్మీర్, కాశ్మీర్ ఉజ్మా, ఆఫ్తాబ్, తమీల్ ఇర్షాద్ వంటి ప్రముఖ ఆంగ్ల, ఉర్దూ దినపత్రికలు తమ మొదటి పేజీలను పూర్తిగా నలుపు రంగుతో ముద్రించాయి. శీర్షికలు తెలుపు మరియు ఎరుపు అక్షరాలలో ముద్రించగా, మిగతా భాగం నల్లగా ఉంచి తీవ్ర శోకాన్ని, ఆగ్రహాన్ని ప్రజలకు ఉద్ధరించాయి. ఇది కేవలం ఒక జర్నలిస్టిక్ చర్య మాత్రమే కాకుండా, బాధితుల పట్ల వారి మానవీయ భావోద్వేగాలను ప్రతిబింబించింది.
కాశ్మీర్ ఉజ్మా, గ్రేటర్ కాశ్మీర్ స్పందన
“ఘోరం: కాశ్మీర్ చిద్రం, కాశ్మీరీలు దుఃఖితులు” అనే ప్రధాన శీర్షికను గ్రేటర్ కాశ్మీర్ పత్రిక తన నల్ల పేజీపై తెల్ల అక్షరాలతో ముద్రించింది. కింద ఉప శీర్షికగా “పహల్గామ్లో భయంకర ఉగ్రదాడిలో 26 మంది మృతి” అనే ఎరుపు అక్షరాల వాక్యాన్ని చేర్చింది. ఈ వర్ణన పాఠకుల హృదయాలను కదిలించింది. ఇదే పత్రిక తన సంపాదకీయంలో “పచ్చిక బయళ్లలో ఊచకోత – కాశ్మీర్ ఆత్మను రక్షించండి” అనే పేరుతో తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసింది. అమాయకుల ప్రాణాలు పోయిన ఘటన పట్ల సంతాపం తెలిపి, ఈ దాడి కేవలం పర్యాటకుల మీద కాకుండా, కాశ్మీర్ యొక్క ఆత్మ మీద జరిగిన ఉగ్రదాడిగా అభివర్ణించింది.
సంపాదకీయం ప్రకారం, “భూతల స్వర్గం”గా పేరొందిన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం మళ్లీ తన పూర్వ వైభవాన్ని పొందేందుకు ప్రయత్నిస్తుండగా, ఇటువంటి దాడులు చీకటి నీడలను విసురుతున్నాయని పేర్కొంది. ఉగ్రవాదుల చర్యలు కేవలం హత్యలు మాత్రమే కాదు, కాశ్మీర్ సంస్కృతి, ఆతిథ్యం, ఆర్థిక వ్యవస్థ మీద కూడా తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని పత్రికలు అభిప్రాయపడ్డాయి.
భద్రతా లోపాలను ఎత్తిచూపిన ఘటన
బేతాబ్ వ్యాలీ వంటి సుందరమైన పర్యాటక ప్రాంతంలో ఇలాంటి భయంకరమైన దాడి జరగడం భద్రతాపరమైన లోపాలను స్పష్టంగా వెల్లడించింది. సంపాదకీయాలలో, “పరిమిత ప్రవేశం ఉన్న ప్రాంతంలో ఇంతటి ఉగ్రదాడి జరగడం నిఘా వ్యవస్థలో తీవ్రమైన వైఫల్యాన్ని సూచిస్తోంది. ఇది కాశ్మీర్ భద్రతా యంత్రాంగానికి మేల్కొలుపు కావాలి” అని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘోర ఘటనలు పునరావృతం కాకుండా అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని పత్రికలు బలంగా వినిపించాయి.
కాశ్మీర్ ప్రజల ఉమ్మడి సంకల్పం
ఈ దాడి తరువాత కాశ్మీర్ ప్రజలు ఉగ్రవాదం పట్ల తమ గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. పత్రికలు తమ సంపాదకీయాల్లో “హింస మమ్మల్ని విభజించరాదు, మేము ఉగ్రవాదం వ్యతిరేకంగా ఏకం కావాలి” అనే సందేశాన్ని ప్రసారం చేశాయి. “కాశ్మీర్ ప్రజలు చాలా కాలంగా హింసను ఎదుర్కొంటూ ఉన్నారు. కానీ వారి శక్తి, సహనం, శాంతి ఆకాంక్ష చెక్కుచెదరలేదు. ఇప్పుడు మనం మరింత దృఢ సంకల్పంతో ముందుకు సాగాలి. మన భూమిని, మన భవిష్యత్తును కాపాడుకోవాలి” అని సంపాదకీయాలు పాఠకులను ప్రేరేపించాయి.
READ ALSO: Terror Attack : ఉగ్రదాడి.. ముగ్గురు టెర్రరిస్టుల స్కెచ్లు విడుదల