తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం 8,427 మంది క్రైస్తవ పాస్టర్లకు నెలకు రూ. 5 వేల చొప్పున గౌరవ వేతనం ఇవ్వనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను సంబంధిత శాఖలు విడుదల చేయడంతో, ఈ ప్రకటన రాజకీయంగా తీవ్ర ప్రతిస్పందన కలిగిస్తోంది.

కేఏ పాల్ ప్రశ్నలు
ఈ నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కఠినంగా స్పందించారు. ఆయన ప్రకటన ప్రకారం, ఇన్నాళ్లూ పాస్టర్లకు గౌరవ వేతనం ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు గుడ్ ఫ్రైడే సందర్భంగా మాత్రమే ఈ ప్రకటన చేయడం వెనుక రాజకీయ ప్రయోజనాలేనా? అని సూటిగా ప్రశ్నించారు. ఇది కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమేనా అని ఆయన అభిప్రాయపడ్డారు.
పాస్టర్ ప్రవీణ్ హత్య
పాస్టర్ ప్రవీణ్ హత్య ఘటనతో రాష్ట్రంలోని క్రైస్తవ, ముస్లిం, హిందూ సమాజాల్లో చర్చలు ముదిరిన నేపథ్యంలో, ప్రభుత్వం పాస్టర్లకు గౌరవ వేతనం ప్రకటించడాన్ని కేఏ పాల్ విమర్శించారు. ఈ వేతనాల ద్వారా పాస్టర్ల నోరు మూయించాలనే ఆలోచన ఏమిటి? అని ప్రశ్నించారు. ప్రజల్లో కలుగుతున్న ఆందోళనను అదుపు చేయాలన్నదే లక్ష్యమా అని వ్యాఖ్యానించారు. కేఏ పాల్ వేసిన మరొక కీలకమైన ప్రశ్న – మిగిలిన 80 వేల మంది పాస్టర్ల పరిస్థితి ఏమిటి? వారిని ఎందుకు విస్మరించారు? అన్నది. అలాగే, రాష్ట్రంలో ఉన్న ముస్లిం మౌలానాలు, హిందూ అర్చకులు, ఇతర మతపెద్దల పరిస్థితిని గురించి కూడా పాల్ నిలదీశారు. అందరికీ సమానత్వం అనే నినాదం రాజ్యాంగంలో ఉంది. కానీ ఆచరణలో ప్రభుత్వానికి వైఖరి వేరుగా కనిపిస్తోంది అని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు స్థితిగతులపై కూడా పాల్ విమర్శలు గుప్పించారు. హిందువులను క్రైస్తవులుగా మారుస్తున్నారని గతంలో చంద్రబాబు అన్నారని ఆ తర్వాత పవన్ కల్యాణ్ కూడా అదే మాట మాట్లాడారని పాల్ మండిపడ్డారు. ఒక లక్ష రూపాయలు కూడా లేని వ్యక్తి లక్షల కోట్లకు అధిపతిగా ఎలా మారతాడు? ఆస్తులు ఎలా పెరిగాయి? ఎవరి ఖర్చుతో ఈ సంపద?” అని ప్రశ్నించారు. ప్రజలు ఈ విషయాలను ఆలోచించాలన్నారు. దైవ జనులారా మనం ఎవరూ మోసపోకూడదని పాల్ అన్నారు. లక్ష రూపాయలు కూడా లేని వ్యక్తి లక్షల కోట్లకు అధిపతి ఎలా అయ్యారనేది ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. మనం అమ్ముడు పోకూడదని అన్నారు. అందరం కలిసి పోరాడి మన పార్టీని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.
Read also: Road Accident: కర్ణాటకలో రోడ్డుప్రమాదం..నలుగురు ఏపీ వాసుల మృతి