అన్నామలై రాజకీయ యాత్రలో కొత్త మలుపు
మాజీ ఐపీఎస్ అధికారి, తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై పేరు ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. పోలీస్ వృత్తి నుంచి రాజకీయాలకీ తన ప్రయాణాన్ని కొనసాగించిన ఆయన, తమిళనాడులో బీజేపీకి గట్టి పునాదులు వేసే ప్రయత్నం చేశారు. అయితే ఇటీవల రాజకీయ పరిణామాల్లో భాగంగా, ఆయన తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తన పాదయాత్రలతో ప్రజల్లో విశేష ఆదరణ పొందిన అన్నామలై, దూకుడు రాజకీయ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకి ఊపు తీసుకురావడంలో ఆయన పాత్ర కీలకమైనప్పటికీ, పార్టీ రాష్ట్రాధ్యక్ష పదవిలో కొనసాగలేకపోయారు. దీనితో ఇప్పుడు అన్నామలై భవిష్యత్తు గురించి నూతన చర్చలు మొదలయ్యాయి.
తమిళనాడు నుండి ఢిల్లీకి – అన్నామలై ప్రయాణం?
తాజాగా, తమిళనాడు టు ఢిల్లీ వయా ఏపీ అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో తెగ వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజ్యసభ ఖాళీ స్థానంపై బీజేపీ దృష్టి సారించినట్టు సమాచారం. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు నేపథ్యంలో, మిత్రపక్షాల మద్దతుతో ఈ సీటును చేజిక్కించుకుని, అన్నామలైను రాజ్యసభకు పంపాలని బీజేపీ అధిష్టానం యోచిస్తోంది. ఇటీవల విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానానికి అనేక పేర్లు చర్చకు వచ్చాయి. కానీ అన్నామలైకు రాజ్యసభ సీటుతో పాటు, కేంద్ర మంత్రివర్గంలో కూడా ఒక కీలక బాధ్యత ఇవ్వాలని పార్టీలో ఓ వర్గం భావిస్తోంది. ఇది దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలం పెంపు వ్యూహానికి భాగంగా చేపట్టిన ప్రణాళికగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
స్మృతి ఇరానీతో పోటీ?
ఇక మరోవైపు, ఇదే ఖాళీ అయిన రాజ్యసభ సీటుకు ప్రముఖ బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పేరు కూడా బలంగా వినిపిస్తోంది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఆమె ఓటమి పాలైన నేపథ్యంలో, ఆమెకు కూడా రాజ్యసభ ద్వారా తిరిగి రాజకీయంగా స్థానం కల్పించాలని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవైపు అన్నామలై, మరోవైపు స్మృతి ఇరానీ మధ్య కీలక పోటీ ఏర్పడినట్లు తెలుస్తోంది. చివరికి ఎవరికీ అవకాశం దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. కేంద్ర నాయకత్వం ఎలాంటి వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంటుందనేది త్వరలో స్పష్టతకు రానుంది.
దక్షిణాదిపై బీజేపీ వ్యూహం
అన్నామలైకు రాజ్యసభ ద్వారా ఢిల్లీలో స్థానం కల్పించడం ద్వారా బీజేపీ దక్షిణాదిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని భావిస్తోంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వంటి కీలక రాష్ట్రాల్లో పార్టీకి వ్యూహాత్మకంగా ప్రయోజనం చేకూర్చేలా ఆయనను ఉపయోగించుకోవాలని యోచిస్తోంది. తన దూకుడు రాజకీయ శైలితో, ప్రజలతో నేరుగా మమేకమయ్యే నైపుణ్యంతో, అన్నామలై బీజేపీకి కొత్త శక్తిని అందించగలడని విశ్వాసం. కాబట్టి, తమిళనాడు రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నా, జాతీయ రాజకీయాల్లో ఆయన పాత్ర మరింత కీలకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
read also: Ananta Babu: అనంతబాబుకు షాక్ కేసు రీఓపెన్ కు ఆదేశాలు