తెలుగు రాష్ట్రాలకు జస్టిస్‌ ఎన్వీ రమణ విరాళం

Justice NV Ramana’s donation to Telugu states

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరదలు సంభవించాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. ఈ వరదలకు అనేక మంది ప్రజలు ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ తారలు, రాజకీయ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తమ వంతు సాయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తున్నారు.

ఈ క్రమంలోనే వరద బాధితుల సహాయార్థం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిన్‌ ఎన్వీ రమణ విరాళం అందజేశారు. తెలుగు రాష్ట్రాలకు చెరో రూ.10 లక్షలు చొప్పున విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని చెక్కుల రూపంలో ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ భవన్‌ల రెసిడెంట్‌ కమిషనర్లకు అందజేశారు. ఈ సందర్భంగా వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను అభినందించారు. ఈ కష్ట కాలంలో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి తమకు చేతనైనంత సాయం చేయాలని పిలుపునిచ్చారు.