రాష్ట్రాల్లో పలు ఆసుపత్రుల వద్ద జూడాల ఆందోళన

junior-doctors-protest-in-telugu-states

హైదరాబాద్‌ : కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచార ఘటనను నిరసిస్తూ తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆసుపత్రుల్లో ఓపీ సేవలను జూనియర్‌ డాక్టర్లు (జూడా) నిలిపివేశారు. కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రిలో పీజీ వైద్యులు విధులు బహిష్కరించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్లకార్డులను ప్రదర్శించారు. మంగళగిరి ఎయిమ్స్‌లో జూనియర్‌ వైద్యులు ఆందోళన చేపట్టారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని ఓపీ సేవలను బహిష్కరించారు. విజయవాడలో సిద్ధార్థ మెడికల్ కళాశాల వైద్య విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు నిరసన ర్యాలీ నిర్వహించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం నుంచి రామవరప్పాడు కూడలి మీదుగా ఈఎస్ఐ ఆసుపత్రి వరకు ఇది కొనసాగింది. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ.. తమను వృత్తి పరంగా కాపాడే రక్షణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. కోల్‌కతాలో జరిగిన ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే దశల వారీ ఉద్యమం చేస్తామన్నారు.