తెలంగాణ కొత్త గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం

Jishnu Dev Varma sworn in as the new Governor of Telangana

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి, హైకోర్టు సీజే జస్టిస్‌ అలోక్‌ అరాధే, పుష్పగచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం పోలీసుల నుంచిగవర్నర్‌ గౌరవ వందనం స్వీకరించారు.

కాగా, జిష్ణుదేవ్ వర్మ 1957 అగస్ట్ 15న జన్మించారు. రామజన్మభూమి ఉద్యమం సమయంలో బీజేపీలో చేరారు. 2018-2023 మధ్య త్రిపుర ఉపముఖ్యమంత్రిగా పని చేశారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా కూడా పని చేశారు. జిష్ణు దేవ్ వర్మ త్రిపుర రాజకుటుంబానికి చెందిన వ్యక్తి.