వైఎస్‌ విజయమ్మతో జేసీ ప్రభాకర్‌రెడ్డి భేటి

JC Prabhakar Reddy meet with YS Vijayamma

హైదరాబాద్‌: ఏపి రాజకీయాల్లో మరో సంచలనం నమోదైంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తల్లి విజయమ్మతో జేసీ బ్రదర్స్‌లో ఒకరైన టీడీపీ సీనియర్ నేత ప్రభాకర్‌రెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని విజయమ్మ ఇంట్లో ఈ సమావేశం జరిగింది. విజయమ్మను ఆప్యాయంగా పలకరించిన జేసీ.. ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకున్నట్టు బయటకు వచ్చిన ఫొటోలను బట్టి తెలుస్తోంది.

విజయమ్మ, జేసీ కుటుంబం మధ్య బంధుత్వం కూడా ఉండడంతోనే ప్రభాకర్‌రెడ్డి ఆమెను కలిసినట్టు చెప్తున్నారు. ఇద్దరూ చాలాసేపు భేటీ అయినప్పటికీ వారి మధ్య ఏం చర్చకు వచ్చిందన్న విషయాలు మాత్రం తెలియరాలేదు. విజయమ్మ ఆరోగ్యం బాగాలేదన్న సమాచారంతోనే ఆమెను పలకరించేందుకు వెళ్లారని ప్రభాకర్‌రెడ్డి అనుచరులు చెప్తున్నారు. ప్రభాకర్‌రెడ్డి కూడా ఈ విషయమై మాట్లాడకపోవడంతో వారి మధ్య ఏం చర్చకు వచ్చిందన్న అంశం ఉత్కంఠ రేపుతోంది.