జగన్ పథకాలు చూసి ఓటేయాలి..అలీ

వైస్సార్సీపీ కార్పొరేటర్ అభ్యర్థుల తరఫున అలీ ప్రచారం

విజయవాడ: టాలీవుడ్ సీనియర్ కమెడియన్ అలీ ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైస్సార్సీపీ తరఫున ప్రచారం చేస్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైస్సార్సీపీ కార్పొరేటర్ అభ్యర్థులకు మద్ధతుగా ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ను అలీ ఆకాశానికెత్తేశారు. సింహం సింగిల్ గానే వస్తుంది అంటూ రజనీకాంత్ పంచ్ డైలాగుతో సీఎంను కొనియాడారు. ఆ సింహం జగన్ మోహన్ రెడ్డేనని పేర్కొన్నారు.

ఒక సామాజిక వర్గం అని కాకుండా అన్ని వర్గాలకు సమన్యాయం చేయాలని భావిస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని, సామాన్య మైనారిటీ మహిళ కరీమున్నీసాకు పిలిచి మరీ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారని అలీ వెల్లడించారు. విజయవాడ అభివృద్ధిపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి ప్రచారాలను నమ్మవద్దని, జగన్ తోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. జగన్ అమలు చేస్తున్న పథకాలను చూసి, భావితరాల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని ఓటేయాలని పిలుపునిచ్చారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/