ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మళ్లీ తీవ్ర విమర్శలు గుప్పించారు రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, మీడియాతో మాట్లాడుతూ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి “వైసీపీ కాదు, ఇది రాబందుల పార్టీ” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నిమ్మల రామానాయుడు సంచలన వ్యాఖ్యలు
మంత్రి నిమ్మల వ్యాఖ్యల ప్రకారం, జగన్ మరియు ఆయన అనుచరులు ప్రజల కష్టాలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇటీవల రాష్ట్రంలో సంభవించిన ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో వైసీపీ దాని మీద రాజకీయం చేయడం దారుణం అని మండిపడ్డారు. పెరుగుతున్న వర్షాలు, వరదలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు – ఇవన్నీ సహానుభూతితో చూడాల్సిన అంశాలు, కానీ జగన్ పార్టీ దానిని కూడ రాజకీయ లాభాలకు వినియోగించేందుకు చూస్తోంది అంటూ మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పాలనపై ఘాటు విమర్శలు చేస్తూ, ఆరేళ్ల పాలనలో బారికేడ్లు, పరదాలు, ముందస్తు అరెస్టులు తప్ప ప్రజలకు సేవ చేసిన ఘటనలు ఏవీ గుర్తుకు రావడం లేదు అని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాలు వినాలి గాని అణచివేయడం కాదు అని స్పష్టం చేశారు.
తెలుగుదేశం పార్టీ చేపట్టిన అమరావతి రాజధాని పునర్నిర్మాణం గురించి మంత్రి మాట్లాడుతూ, అది దేశ చరిత్రలో నిలిచిపోయే ప్రాజెక్టుగా నిలవనుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రైతుల త్యాగాన్ని గౌరవిస్తూ ప్రతి ఒక్క పౌరుడికి గర్వకారణంగా రాజధాని అభివృద్ధి కొనసాగుతుందని పేర్కొన్నారు. “అమరావతి కోసం తపన పడిన రైతుల కృషి మరియు ధైర్యం మరువలేనిది. వారి ఆశయాలకు న్యాయం చేయడం తెలుగుదేశం బాధ్యతగా భావిస్తోంది” అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పాలకొల్లులో రూ.1.63 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి, స్థానిక ప్రజలతో సమావేశమై అభివృద్ధి ప్రణాళికల గురించి చర్చించారు. పాలకొల్లును అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.
Read also: TTD: వేసవి రద్దీ దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం!