వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇటీవల జరిగిన అవిశ్వాస తీర్మానాల తరువాత పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపే లక్ష్యంతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా, ఈ రోజు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఆయన కీలక సమావేశం నిర్వహించనున్నారు.

సమావేశంలో హాజరు కానున్న పలు కీలక నేతలు
ఈ సమావేశానికి అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలం, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ, పెనుకొండ నియోజకవర్గంలోని రొద్దం మండలాల ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, తదితర ప్రజాప్రతినిధులతో పాటు ఆయా జిల్లాల ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ఈ భేటీలో రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ఇటీవల చోటుచేసుకున్న అవిశ్వాస తీర్మానాలు, అధికార పార్టీకి ఎదురవుతున్న సవాళ్లు తదితర అంశాలపై సమగ్రంగా చర్చ జరగనుంది. క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టపర్చే విధానాలు, నాయకత్వ మార్పులు, ప్రాదేశిక సమీకరణాలు వంటి కీలక అంశాలపై వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
ఇదే సమయంలో పార్టీలో చిత్తశుద్ధితో పని చేస్తున్న నేతలకు మద్దతు, మార్గదర్షనాలు ఇవ్వడంతో పాటు, రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ బలోపేతానికి సంబంధించి కార్యాచరణ రూపొందించనున్నారు. ఈ సమావేశం అనంతరం, జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు సాయంత్రం బెంగళూరు వెళ్లనున్నారు. సాయంత్రం 4:15 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి, 5:40 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి, 8:00 గంటలకి బెంగళూరులోని తన నివాసానికి చేరుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Read also: Andhra Pradesh: నాలో ఆ మార్పు తీసుకొచ్చింది చంద్రబాబే: జగన్