రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర లభించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో సీఎం చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు. రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం మాత్రం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.

జగన్ ట్వీట్లో చంద్రబాబు గారూ కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా వారి గోడు పట్టించుకోవడం లేదు. కనీస మద్దతు ధరలు లభించక, పెట్టిన పెట్టుబడులూ రాక రైతులు అప్పుల ఊబిలోకి కూరుకు పోతున్నారు. మీరు, మీ మంత్రులు, యంత్రాంగం కనీసం వారివైపు కన్నెత్తికూడా చూడకపోవడం ధర్మమేనా? పేర్కొన్న ప్రకారం, రైతులు మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, వేరుశెనగ, టమోటా, అరటి, చీని, పొగాకు వంటి పంటల కోసం కష్టపడుతున్నప్పటికీ మార్కెట్లో కనీస ధరలు కూడా లభించకుండా తీవ్రంగా నష్టపోతున్నారు. పెట్టుబడులు పెడుతున్నా ఆదాయం లేకపోవడంతో రైతులు అప్పుల ఊబిలోకి నెట్టబడుతున్నారని తెలిపారు.
కేంద్రంపై నమ్మబలికే డ్రామా?
ముఖ్యంగా మిరప రైతుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న వైఖరి సరిగ్గా లేదని జగన్ ధ్వజమెత్తారు. మొదట నాఫెడ్ కొనుగోలు చేస్తుందని నమ్మబలికి, రూ.11,781కు క్వింటాలు కొనుగోలు చేస్తామని చెప్పినా చివరకు ఒక్క రైతునుంచికైనా, ఒక్క క్వింటాల్ గాని కొనకుండా డ్రామా ముగించారని ఆరోపించారు. కేంద్రంపై బాద్యత వేశారు అంటూ నమ్మబలికి, తర్వాత చేతులు దులిపేసిన తీరును జగన్ తీవ్రంగా ఎద్దేవా చేశారు.
పాత ప్రభుత్వ పాలనను గుర్తు చేసిన జగన్
తాము అధికారంలో ఉన్న సమయంలో ధరల స్థిరీకరణ నిధిగా రూ.3,000 కోట్లు ఏర్పాటు చేసి, ఐదేళ్లలో రూ.7,796 కోట్లు రైతుల కోసం ఖర్చు పెట్టామని జగన్ గుర్తుచేశారు. పొగాకు వంటి MSP జాబితాలో లేని పంటలకు కూడా ఆర్థిక భరోసా కల్పించామని పేర్కొన్నారు. ఇప్పుడు కొత్తగా ఏ విధానం అమలు చేయకపోయినా కనీసం తమ విధానాన్ని కొనసాగించి ఉంటే రైతులకు కొంత ఊరట కలిగేదని అన్నారు. మీరు కొత్తగా ఏమీ చేయకపోయినా, పైగా ఈ ఏడాది బడ్జెట్లో రూ.300 కోట్లు కేటాయించడం దారుణం కాదా? ఇందులో కూడా కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు ఉన్నాయా? ధాన్యం, కోకో, పొగాకు, ఆక్వా రైతులు ఆయా జిల్లాల్లో ఆందోళనలు చేస్తుంటే, ఇప్పటికీ రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా వ్యవహరిస్తున్నారు. జనాభాలో 60శాతం మంది ప్రజలు ఆధారపడే వ్యవసాయరంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అది తీవ్ర సంక్షోభానికి దారితీస్తే, లక్షల మంది ఉపాధికి గండిపడితే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? వెంటనే ప్రభుత్వం తరఫున మార్కెట్లో జోక్యం చేసుకోవాలని, కనీస ధరలు లభించని పంటల విషయంలో ప్రభుత్వమే జోక్యంచేసుకుని, మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాను అంటూ జగన్ స్పష్టం చేశారు.
Read also: Senior citizen: సీనియర్ సిటిజన్ కార్డుతో ఎన్ని లాభాలో తెలుసా?