మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఇటువంటి దారుణమైన పాలనను ఎప్పుడూ చూడలేదని అన్నారు. రాష్ట్రం అంతటా బెల్ట్ షాపులు పెరిగిపోతున్నాయని, ఎటు చూసినా అవే కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో ఇసుక అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందని గుర్తు చేస్తూ, ప్రస్తుతం అధిక ధరలకు ఇసుక అమ్మినా రాష్ట్ర ఖజానాకు లాభం లేదని విమర్శించారు.
చంద్రబాబు తన అనుచరులకు రూపాయికి ఎకరాల చొప్పున భూములు
జగన్ మాట్లాడుతూ చంద్రబాబు తన అనుచరులకు రూపాయికి ఎకరాల చొప్పున భూములు కేటాయిస్తున్నారని ఆరోపించారు. ఊరూ పేరు లేని లూలూ, లిల్లీ కంపెనీలకు భారీగా భూములు ఇస్తున్నారని ఆరోపించారు. రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసి, మళ్లీ మొబలైజేషన్ అడ్వాన్సులు ప్రవేశపెట్టారని మండిపడ్డారు. “రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది” అంటూ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. మైన్లు, ఫ్యాక్టరీలు నడిపేందుకు స్థానిక ఎమ్మెల్యేలకు లంచం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.
జగన్ 2.0లో తప్పకుండా పెద్ద పీట వేస్తా
కుప్పం, కదిరి, మార్కాపురం తదితర నియోజకవర్గాల స్థానిక నాయకులతో జగన్ సమావేశమయ్యారు. కార్యకర్తల సమస్యలు తెలుసుకున్న జగన్, “గతంలో కోవిడ్ కారణంగా పార్టీ కార్యకర్తలకు సహాయపడలేకపోయాం. అయితే జగన్ 2.0లో తప్పకుండా పెద్ద పీట వేస్తా” అని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఎదురవుతున్న కష్టాలు తాత్కాలికమేనని, త్వరలోనే మంచి రోజులు వస్తాయని కార్యకర్తలను ధైర్యపరిచారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని, చంద్రబాబుతో వచ్చే దుర్మార్గ పాలన ఎక్కువ రోజులు నిలవదని ధీమా వ్యక్తం చేశారు.
Read Also : Modi : ఏపీకి మోడీ రాక..కట్టుదిట్టమైన భద్రత