‘పుష్ప-2’ మూవీ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట కేసులో నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు. కాగా అల్లు అర్జున్ అరెస్ట్ చేయడాన్ని సినీ అభిమానులు, సినీ ప్రముఖులే కాదు రాజకీయ ప్రముఖులు సైతం తప్పు పడుతున్నారు. ఇప్పటికే బిఆర్ఎస్ , బిజెపి నేతలు స్పందించగా..తాజాగా ఏపీ మాజీ సీఎం , వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సైతం రియాక్ట్ అయ్యారు.
హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేనిది. అదే సమయంలో దీనిపై అల్లు అర్జున్ తన విచారాన్ని వ్యక్తంచేసి, ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారు. అయితే ఈ ఘటనకు నేరుగా అతడ్ని బాధ్యుడ్ని చేయడం ఎంతవరకు సమంజసం? తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అర్జున్పై క్రిమినల్ కేసులు బనాయించి, అరెస్టు చేయడం సమ్మతంకాదు. అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ పేర్కొన్నారు.
అసలు బెన్ఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించింది ఎవరు అంటూ బిఆర్ఎస్ నేత , మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. సినిమా కోసం వెళ్లి తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని హరీశ్రావు అన్నారు. దీనికి అసలు కారకులు, రాష్ట్ర పాలకులే అని తెలిపారు. చర్యలు తీసుకోవాల్సింది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పైనే అని ఆయన స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి బ్రదర్స్ వేధింపుల వల్లే చనిపోతున్నా అని సూసైడ్ లెటర్ రాసి సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య చేసుకుంటే రేవంత్ బ్రదర్స్ను ఎందుకు అరెస్టులు చేయరని ప్రశ్నించారు.
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సైతం అల్లు అర్జున్ అరెస్ట్ ను ఖండించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిందని రాజా సింగ్ అన్నారు. ఈ ఘటనకు పోలీసుల వైఫల్యమే కారణమని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసులో అల్లు అర్జున్ను నేరస్తుడిగా చూడటం సరికాదని సూచించారు. అల్లు అర్జున్ జాతీయ అవార్డు సాధించి తెలుగువారి ప్రతిష్ఠను పెంచారని గుర్తుచేశారు.