అలాంటి వ్యక్తి దేశానికే హోంమంత్రిగా ఉండడం విచిత్రం : శరద్ పవార్
న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనపై చేసిన వ్యాఖ్యల పట్ల ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తీవ్రంగా స్పందించారు. దేశంలోని అవినీతిపరులకు నేనొక ముఠా నాయకుడ్ని అంటూ అమిత్ షా నాపై విమర్శలు చేశారు… కానీ గతంలో ఓ కేసులో సుప్రీంకోర్టు అమిత్ షాను రెండేళ్లు గుజరాత్ నుంచి బహిష్కరించింది… అలాంటి వ్యక్తి ఇప్పుడు దేశానికే హోంమంత్రిగా ఉండడం విచిత్రం అని శరద్ పవార్ వ్యాఖ్యానించారు.
చట్టాన్ని దుర్వినియోగం చేశారన్న కేసులో అమిత్ షాను సుప్రీంకోర్టు రెండేళ్లు బహిష్కరించింది నిజం కాదా? మన దేశం ఎలాంటి వ్యక్తుల చేతిలో ఉందో ఒక్కసారి ఆలోచించుకోవాలి… ఇటువంటి వ్యక్తులు దేశాన్ని అవినీతి మార్గంలోనే నడిపిస్తారు అంటూ శరద్ పవార్ ధ్వజమెత్తారు. కాగా, గతంలో సంచలనం సృష్టించిన సొహ్రాబుద్దీన్ ఎన్ కౌంటర్ కేసులో సుప్రీంకోర్టు అమిత్ షాను రెండేళ్ల పాటు గుజరాత్ నుంచి బహిష్కరించింది. ఈ అంశాన్నే శరద్ పవార్ విమర్శనాస్త్రంగా మలుచుకున్నారు.