విశాఖపట్నంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం దేవస్థానం సమీపంలో విషాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం భారీ వర్షం రావడం తో రూ.300 టికెట్ క్యూలైన్ వద్ద గోడ కూలింది. ఈ ఘటన లో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారు. వెంటనే స్పందించిన అధికారులు సహాయక చర్యలు చేపట్టి, గాయపడినవారిని ఆసుపత్రులకు తరలించారు. ఈ సంఘటనపై రాష్ట్రం, దేశం నలుమూలల నుండి స్పందనలు వస్తున్నాయి. రాష్ట్రపతి, ప్రధానమంత్రి సహా పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది.
ప్రభుత్వం పై వైసీపీ విమర్శలు
ప్రమాద స్థలాన్ని ప్రభుత్వ మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించి, కారణాలపై చర్చించారు. కేవలం పదిరోజుల క్రితమే నిర్మించిన గోడ ఇలా కూలిపోవడంపై వైసీపీ నేతలు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 72 గంటల్లోగా పూర్తిస్థాయి విచారణ నివేదిక ఇవ్వాలని ఆదేశించగా, ముగ్గురు సభ్యులతో కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కమిటీ రెవెన్యూ, ఇంజనీరింగ్ నిపుణులతో కూడి ఉంటుంది. ప్రాథమిక విచారణలోనే గోడ నిర్మాణంలో నాణ్యతా లోపాలు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం.
Read Also : Devineni Son Wedding : అట్టహాసంగా దేవినేని కుమారుడి వివాహం
గోడ నిర్మాణంలో సరైన ప్రమాణాలు పాటించకపోవడం
గోడ నిర్మాణంలో సరైన ప్రమాణాలు పాటించకపోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని అధికారులు అభిప్రాయపడుతున్నారు. కూలిపోయిన గోడ ఇటుకలు విడివిడిగా పడిపోయిన తీరు చూస్తే, వాటి మధ్య సరైన సిమెంట్ మిశ్రమం ఉపయోగించలేదని తెలుస్తోంది. అంతేకాదు, క్యూలైన్కు గోడ మధ్య ఉన్న మూడు అడుగుల గ్యాప్ వల్ల మట్టిపెళ్లలు గోడపై పడటంతో అది ఒక్కసారిగా కూలిపోయింది. ఇది తార్కికంగా నిర్మాణ లోపం వల్లే జరిగిందన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు.