INS బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. సెయిలర్ గల్లంతు

ముంబైలోని నావల్ డాక్యార్డ్లో INS బ్రహ్మపుత్ర యుద్ధనౌకలో అగ్నిప్రమాదం జరిగింది. మహారాష్ట్ర ముంబైలోని డాక్‌యార్డ్‌లో ఆదివారం సాయంత్రం రీఫిట్ పనులు నిర్వహిస్తుండగా మంటలు చెలరేగినట్లు సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ అగ్ని ప్రమాదంలో ఐఎన్ఎస్ బ్రహ్మపుత్ర తీవ్రంగా దెబ్బతింది. మరోవైపు.. ఆ ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో ఉన్న ఒక సెయిలర్ జాడ గల్లంతు కాగా.. మిగిలిన వారు సురక్షితంగా బయటపడ్డారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు చర్యలు చేపట్టారు. గల్లంతైన సెయిలర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఒక్క జూనియర్ సైలర్ తప్ప మిగతా అందరినీ రక్షించామని, గల్లంతైన నావికుడి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొంది. ఈ ప్రమాదంపై నేవీ విచారణకు ఆదేశించింది. తాజా ఘటనతో కలిపి గత 11 సంవత్సరాల్లో మూడు నౌకలు మునిగిపోయాయి. 2013లో ఐఎన్ఎస్ సింధురక్షక్, 2016 ఐఎన్ఎస్ బెత్వా నౌకలు మునిగిపోయాయి.

దేశీయంగా నిర్మించిన తొలి యుద్ధ నౌక అయిన ఐఎన్ఎస్ బ్రహ్మపుత్ర.. క్లాస్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్‌లో మొదటిది. ఏప్రిల్ 2000లో దీనిని నేవీలోకి ప్రవేశపెట్టారు. ఇందులో 40 మంది అధికారులు, 330 మంది సైలర్లు ఉంటారు. మధ్యశ్రేణి, క్లోజ్ రేంజ్, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్‌లు, ఉపరితలం నుంచి ఉపరితలం, ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించే క్షిపణలు, టార్పెడో లాంచర్లతో బలమైన రక్షణ వ్యవస్థ కలిగి ఉంది. దీంట్లో సముద్రం నుంచే అన్ని కోణాల్లోనూ నిఘాపెట్టగల సెన్సార్లు ఉన్నాయి. అంతేకాదు, సీకింగ్, చేతక్ హెలికాప్టర్లను కూడా ఆపరేట్ చేయగల సామర్థ్యం దీనికి ఉంది. ఈ యుద్ధనౌక బరువు 5,300 టన్నులు. పొడవు 125 మీటర్లు. 27 నాట్ల వేగంతో ప్రయాణించగలదు.